
హైదరాబాద్: ఆదివారం జరిగిన అండర్ 19 ఆసియా కప్ మ్యాచ్లో భారత్పై నేపాల్ జట్టు 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. అనంతరం 186 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 166 పరుగులకే ఆలౌటైంది.
ఒకానొక దశలో 91/1తో పటిష్టంగా కనిపించిన టీమిండియా ఆ తర్వాత వరుసగా నికెట్లు కోల్పోయి మ్యాచ్ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్లో నేపాల్ కెప్టెన్ బ్యాటింగ్లో 88 పరుగులు చేసి, బౌలింగ్లో 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే మ్యాచ్ అనంతరం నేపాల్ జట్టుకు అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ అభినందనలు తెలిపాడు.
నేపాల్ జట్టు కోచ్ బినోద్ కుమార్ దాస్తో కలిసి ఆ జట్టు డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లిన ద్రవిడ్ వారికి అభినందనలు తెలియజేశాడు. 'మేం గెలిచిన తర్వాత ద్రవిడ్ మాకు కంగ్రాట్స్ చెప్పాడు. టోర్నీలో మిగతా వాళ్ల కంటే గొప్పగా ఆడారని అభినందించాడు. మా శ్రమను అతడు గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. ద్రవిడ్ మాకు మద్దతు పలకడం ఎంతో థ్రిల్లింగ్గా ఉంది' అని బినోద్ కుమార్ చెప్పాడు.
'గతంలో మేం ఎప్పుడూ, ఏ స్థాయిలోనూ భారత్పై నేపాల్ జట్టు నెగ్గకపోవడం విశేషం. భారత్ ఎంత బలమైన జట్టో మాకు తెలుసని, వారిపై గెలుపు మాకు అతిపెద్ద విజయమని దాస్ పేర్కొన్నాడు. మలేసియాపై భారత్ 202 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన తర్వాత మేం గెలవడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని తెలిపాడు.