టీ20 వరల్డ్ కప్-2024లో భారత్ ఛాంపియన్గా నిలిచింది. రోహిత్ సేన అద్భుతంగా పోరాడి 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అయితే విశ్వవిజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా అందించిన సంగతి తెలిసిందే. విక్టరీ పరేడ్ అనంతరం వాంఖడే స్టేడియంలో రూ.125 కోట్ల చెక్ అందజేసింది.
అయితే ఈ భారీ మొత్తాన్ని ఆటగాళ్లకు, కోచింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది, సెలక్టర్లుకు బీసీసీఐ కొన్ని ప్రమాణాల ప్రకారం వాటాలు పంచింది. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులోని సభ్యులకు తలో రూ.5 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఆటగాళ్లతో సమానంగా టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు రూ.5 కోట్లు ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ అయ్యింది.

అయితే రాహుల్ ద్రవిడ్ సహాయక సిబ్బంది అయిన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాజ్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్లకు తలో రూ.2.5 కోట్లు మాత్రమే ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో తన సహాయ సిబ్బందికి ఇచ్చిన మొత్తాన్ని ఇవ్వాలని బీసీసీఐని ద్రవిడ్ కోరినట్లు సమాచారం. రూ.5 కోట్లను ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించాడని జాతీయ మీడియా రాసుకొచ్చింది.
బీసీసీఐ ఇచ్చిన ప్రైజమనీని భారత జట్టులోని 15 మంది సభ్యులు అయిన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, సంజు శాంస్, యశస్వీ జైస్వాల్కు తలా రూ. అయిదు కోట్లు ఇవ్వనున్నారు.
సహాయక కోచ్లకు తలో రూ.2.5 కోట్లు, అలాగే ఇతర సహాయక సిబ్బందిగా ఉన్న తొమ్మిది మందికి తలో రూ. 2 కోట్లు ఇవ్వనున్నారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సభ్యులకు, రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికైన రింకూ సింగ్, శుభ్మన్ గిల్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్లకు తలా రూ.కోటి అందివ్వనున్నారు.