సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన భారత్ మరో టెస్టు సిరీస్ సమరానికి సిద్ధమవుతోంది. కంగారూల గడ్డపై నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో అయిదు టెస్టుల సిరీస్ ఆడనుంది. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లో 2018/19, 2020/21లో టీమిండియానే విజయం సాధించింది. ఈ సారి కూడా ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది.
అయితే 2020/21 పర్యటనలో టీమిండియా పోరాటం అద్వితీయం. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే ఆలౌటై పేలవ రికార్డు నమోదుచేసినప్పటికీ.. ఆ తర్వాత గొప్పగా పుంజుకుని 2-1తో విజయం సాధించింది. ఇక ఆస్ట్రేలియా కంచుకోటగా ఉన్న గబ్బా వేదికగా ఆఖరి టెస్టులో విజయాన్ని సాధించి భారత్ సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే గబ్బా విజయానంతరం రిషభ్ పంత్పై ప్రశంసలు జల్లులు కురిశాయి. కానీ టీమిండియా గెలుపులో శుభ్మన్ గిల్ పాత్ర కీలకమైనదని మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు.

గత కొన్నేళ్లుగా వాల్గా వన్డౌన్లో వచ్చి భారత టెస్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన రాహుల్ ద్రవిడ్, చెతేశ్వర్ పుజారా లేకుండా ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. ఈ క్రమంలో దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ద్రవిడ్ను ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విజయానికి పంత్ కారణమని అందరూ పొగిడారని, కానీ గబ్బా టెస్టులో అయిదో రోజు గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని ద్రవిడ్ చెప్పాడు. తన ఆట, పుజారా ఆటతో పోలిస్తే గిల్ స్టైల్ వేరు అయినప్పటికీ, అతను మంచి ప్లేయర్ అని పేర్కొన్నాడు.
''మూడో స్థానంలో గిల్ ఉన్నాడు. అతనో అద్భుతమైన ప్లేయర్. గత ఆస్ట్రేలియా పర్యటనలో అతను విజయవంతమయ్యాడు. ప్రతి ఒక్కరూ రిషభ్ పంత్ అజేయ 80 పరుగులు గురించి మాట్లాడుకుంటారు. కానీ అయిదో రోజు ఆటలో ఉదయం గిల్ 91 పరుగులతో మ్యాచ్ను కాపాడాడు. కాబట్టి అతను గొప్ప ప్లేయర్, మంచి కుర్రాడు. అతను నేర్చుకుంటున్నాడు. నాతో, పుజారాతో పోలిస్తే అతను భిన్నంగా బ్యాటింగ్ చేస్తాడు. కానీ గిల్ చాలా మంచి ఆటగాడు''
''టాప్ ఆర్డర్లో పరుగులు రావడం చాలా ముఖ్యం. 1,2,3 లేదా 4 స్థానాల్లో నుంచి పరుగులు వచ్చాయా అనేది కీలకం కాదు. టాప్ ఆర్డర్ సత్తాచాటితే ఆస్ట్రేలియా సిరీస్లో పైచేయి సాధించవచ్చు. ఆసీస్ పరిస్థితులు, కూకబుర్ర బంతితో సత్తాచాటాలంటే టాప్-4 బ్యాటర్లు నిలవాలి. అప్పుడే లోయర్ ఆర్డర్కు పని సులభం అవుతుంది'' అని రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. పెర్త్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 7.50కు మ్యాచ్ ప్రారంభం కానుంది.