బెంగుళూరు: గంగూలీతో పాటు తాను బెంగాల్ జాతిని కించపరిచేలా వ్యాఖ్యానించినట్లు మనోజ్ తివారీ చేసిన ఆరోపణలపై గౌతమ్ గంభీర్ స్పందించారు. రంజీ ట్రోఫీలో భాగంగా శనివారం బెంగాల్, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇరు జట్ల కెప్టెన్లు అయిన గౌతమ్ గంబీర్, మనోజ్ తివారీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
ఈ వాగ్వాదంపై బెంగాల్ కెప్టెన్ మనోజ్ తివారీ మాట్లాడుతూ గంగూలీతో పాటు బెంగాల్ జాతిని కించపరుస్తూ గంభీర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడని ఆదివారం మీడియాతో అన్నాడు. తివారీ చేసిన ఆరోపణలను గంభీర్ ఖండించాడు.
ఒక భారతీయుడిగా అన్ని మతాలు, కులాల వారిని తాను గౌరవిస్తానని తెలిపాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తాను కోల్కత్తా నైట్ రైడర్స్ తరుపున ఆడుతున్న తనపై, జట్టుపై బెంగాలీలు అపారమైన ప్రేమను కనబరుస్తున్నారని అందుకు కృతజ్ఞతుడనని పేర్కొన్నాడు.

బెంగాల్ నాకు రెండో ఇల్లులాంటిదని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పాను. బెంగాల్ ప్రజలంటే నాకెంతో గౌరవం ఉంది. దాదాను, బెంగాల్ జాతిని అవమానించేలా నేను వ్యాఖ్యలు చేసినట్లు తివారీ ఆరోపించడం నిరాధారమని అన్నాడు. ఏదో సంచలనం కోసం తివారి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడు అని గంభీర్ అన్నాడు.
తనకు ఫేవరెట్ క్రికెటర్లలో గంగూలీ ఒకరని, దాదా అని మేమంతా ప్రేమగా పిలుచుకునే గంగూలీ సారథ్యంలో ఎన్నో మ్యాచ్లు ఆడానని చెప్పాడు. మనోజ్ తివారీ నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని పేర్కొన్నాడు. ఏదో ఊహించుకుని అదే నిజమన్నట్టుగా మాట్లాడుతున్నాడని తెలిపాడు.
అయితే గంభీర్, తివారీ గొడవపై పూర్తి నివేదికను మ్యాచ్ రిఫరీ బీసీసీఐకి పంపాడు. తుది విచారణ చేపట్టాక ఆటగాళ్లపై బీసీసీఐ శిక్షను ఖరారు చేయనుంది.