ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్రను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. బేసిక్ ప్రైజ్ రూ.50 లక్షలతో వేలానికి వచ్చిన రచిన్ కోసం సీఎస్కే రూ.1.80 కోట్లు వెచ్చించింది. అయితే రచిన్ భారీ ధర పలుకుతాడనుకుంటే తక్కువ ధరకే చెన్నై గూటికి చేరాడు. టాప్ ఆర్డర్లో పరుగుల వరద పారించే సత్తా ఉన్న రచిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్లోనూ అదరగొట్టాడు.
అయితే రచిన్కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. ప్రాక్టీస్కు వెళ్తున్న రచిన్ను ఓ సీఎస్కే అభిమాని పలకరించాడు. తన దగ్గర ఫ్లకార్డ్ను చూపిస్తూ జ్ఞాపకంగా ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరాడు. ఆ ఫ్లకార్డ్లో చెన్నై సూపర్ కింగ్స్కు సంబంధించిన ఫొటోలు ఉన్నాయి. అందులో రచిన్ సీఎస్కే జెర్సీ ధరించి ఉన్న ఫొటో కూడా ఉండటం విశేషం. ఇది చూసి మురిసిపోయిన రచిన్ తన దగ్గర ఉన్న హెల్మెంట్, గ్లవ్స్ను కిందపెట్ట ఫ్లకార్డ్పై ఆటోగ్రాఫ్ చేశాడు.

అభిమాని ప్రేమకు ఫిదా అయిన రచిన్ను నెట్టింట్లో కొనియాడుతున్నారు. ఫ్యాన్స్ కోసం ఓపికగా అతడు సమయాన్ని వెచ్చించడం బాగుందని మెచ్చుకుంటున్నారు. కాగా, వచ్చే ఐపీఎల్ సీజన్ మార్చి మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దేశంలో లోక్ సభ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఐపీఎల్ షెడ్యూల్ను ఇంకా ఖరారు చేయలేదు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మార్చిలో శిక్షణ శిబిరాన్ని ప్రారంభించాలని భావిస్తుంది. ఇప్పటివరకు సీఎస్కే అయిదు టైటిళ్లను సాధించింది.
వేలంలో చెన్నై దక్కించుకున్న ఆటగాళ్లు: డారిల్ మిచెల్ (రూ. 14 కోట్లు), సమీర్ రిజ్వీ (రూ. 8.40 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (రూ. 4 కోట్లు), ముస్తాఫిజుర్ (రూ. 2 కోట్లు), రచిన్ రవీంద్ర (రూ. 1.80 కోట్లు), అవనీశ్ రావు (రూ.20 లక్షలు)