హైదరాబాద్: టెస్టు సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికాల మధ్య రెండో రోజు మ్యాచ్ జరుగుతోంది. ఈ మధ్య స్లెడ్జింగ్, క్రికెటర్ల మధ్య వ్యక్తిగత దూషణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. హద్దు మీరి ప్రవర్తిస్తే ఆటగాళ్ల మ్యాచ్ ఫీజుల్లో కోతను విధిస్తూనే ఉంది ఐసీసీ. సిరీస్లో భాగంగా ఇప్పటి వరకు జరిగిన రెండు టెస్టు మ్యాచ్లో ఇరు జట్లు చెరొకటి గెలిచి సిరీస్లో సమంగా నిలిచాయి.
ఈ నేపథ్యంలో గురువారం ప్రారంభమైన మూడో టెస్ట్ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 311 పరుగులకు కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా ఓపెనర్లు ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించారు. ముఖ్యంగా రెండు టెస్టుల్లో ఆసీస్ పతనాన్ని శాసించిన దక్షిణాఫ్రికా పేసర్ రబాడపై వార్నర్ కసితీర్చుకున్నాడు.
ఒకే ఓవర్లో వరుసగా ఐదు బంతులను బౌండరికీ తరలించాడు. రబాడ వేసిన నాలుగో ఓవర్ చివరి మూడు బంతులను బౌండరీలకు పంపించిన వార్నర్.. ఆరో ఓవర్ తొలి బంతిని సిక్స్ కొట్టాడు. రెండో బంతిని రబాడ నోబాల్ వేయగా దాన్ని సైతం బౌండరీకి తరలించాడు.
ఆ ఓవర్లో 4, 4, 4, 6, 4 పరుగులు చేశాడు.
వార్నర్ ఆటతీరుతో రబాడతో పాటు మైదానంలో ఉన్న వారందరికీ ఆశ్చర్యపోవడమే వంతైంది. అతను రెచ్చిపోయి ఆడే ఆటతీరు చూస్తే .. ఇది టెస్టు మ్యాచ్..ఆ.. లేదా టీ20 అనే సందేహమూ రాకమానలేదు. దీంతో రబాడపై వార్నర్కు కాస్త కోపం చల్లారినట్లు ఉంది.