
హైదరాబాద్: హమ్మయ్య! లంక పర్యటనలో దక్షిణాఫ్రికాకు కాస్త ఊరట లభించింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా రాంగిరి స్టేడియంలో ఆతిథ్య శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. దక్షిణాఫ్రికా విజయంలో కగిసో రబడా, తబ్రైజ్ షంషి కీలకపాత్ర పోషించారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 34.3 ఓవర్లలో 193 పరుగులు చేసి ఆలౌటైంది. శ్రీలంక బ్యాటింగ్లో కుషల్ పెరీరా(81), తిషారా పెరీరా(49) మినహా మిగితా వారందరూ స్వల్పస్కోర్కే పరిమితమయ్యారు. సఫారీ బౌలర్లలో కగిసో రబడా, తబ్రైజ్ షంషి తలో నాలుగు వికెట్లు తీయగా... లుంగి ఎంగిడి ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం 194 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 31 పరుగుల వద్ద ఓపనర్ ఆమ్లా(19), మార్క్రమ్(0) వరుస బంతుల్లో పెవిలియన్కు చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ డుప్లెసిస్(47), మరో ఓపెనర్ డికాక్(47)తో కలిసి నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తించాడు.
వీరిద్దరూ కలిసి మూడో వికెట్కి 86 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే అయితే ధనుంజయ వేసిన 21వ ఓవర్ నాలుగో బంతికి డికాక్ లక్మల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరడంతో వీరి భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కొద్దిసేపటికే సందకన్ బౌలింగ్లో డుప్లెసిస్(47) మాథ్యూస్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన డుమినీ(53) హాఫ్ సెంచరీతో రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 53 పరుగులు చేశాడు. ఫలితంగా దక్షిణాప్రికా 31 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసి విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో బౌలింగ్లో అద్భుత ప్రదర్శన చేసిన తబ్రైజ్ షంషికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.