ఐపీఎల్ 2025లో ఎన్నో అంచనాలతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆశించినంత స్థాయిలో ఆడట్లేదు. బౌలింగ్ లో అశ్విన్ సగటు 40 ఉండగా, ఎకానమీ రేటు 9కి పైగా ఉంది. దీంతో అతడిపై విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అశ్విన్ మరో కొత్త వివాదంలోకి చిక్కుకున్నాడు. దీంతో విమర్శలు మరింత ఎక్కువై.. అశ్విన్ పై ఒత్తిడి ఎక్కువైపోయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
కొత్త వివాదం ఇదే?
ఈ ఐపీఎల్ సీజన్లో అశ్విన్ మాత్రమే కాదు మొత్తం సీఎస్కే మొత్తం జట్టు కూడా పేలవ ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో ఓడింది. పాయింట్ల పట్టికలో కూడా కిందకి పడిపోయింది. జట్టులోని కీలక బ్యాటర్లంతా చేతులెత్తేస్తున్నారు. కేవలం ఆ జట్టులోని స్పిన్నర్ నూర్ అహ్మద మాత్రమే రాణిస్తున్నాడు. జరిగిన నాలుగు మ్యాచ్ల్లో 10 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. కానీ అశ్విన్ కు చెందిన యూట్యూబ్ ఛానల్ మాత్రం నూర్ అహ్మద్ పై తీవ్ర విమర్శలు చేసి వివాదంలో ఇరుక్కుంది.
