
హైదరాబాద్: 2020 కౌంటీ సీజన్ క్రికెట్లో భాగంగా టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యార్క్షైర్ జట్టు తరుపున ఆడనున్నాడు. వచ్చే సీజన్లో కౌంటీ ఛాంపియన్షిప్లో భాగంగా యార్క్షైర్ తరుపున అశ్విన్ ఎనిమిది మ్యాచ్లు ఆడేందుకు ఒప్పందం చేసుకున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్ ముగిసిన తర్వాత బీసీసీఐ అనుమతితో అశ్విన్ కౌంటీ క్రికెట్ ఆడనున్నాడు. 2019లో కేశవ్ మహారాజ్ విజయవంతం కావడంతో యార్క్ షైర్ క్లబ్ యొక్క ప్రధాన 'ఓవర్సీస్ స్పిన్నర్'గా అశ్విన్ పగ్గాలు చేపట్టనున్నాడు.
ఈ సందర్భంగా అశ్విన్ మాట్లాడుతూ "ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడటం ఎంతో ఇష్టం. గతంలో వోర్సెస్టర్షైర్, నాటింగ్హామ్షైర్ల తరుపున ఆడినప్పుడు ఎంతగానో ఆస్వాదించాను. అద్భుతమైన చరిత్ర, ఫ్యాన్ బేస్ కలిగిన యార్క్ షైర్ క్లబ్ తరుపున ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నా" అని అన్నాడు.
"ఇక్కడ నా పాత్ర ఏంటంటే పరుగులు చేయడం, వికెట్లు తీయడం, సమిష్టిగా రాణించి టైటిల్ నెగ్గుతాం. నాకు యార్క్షైర్ గురించి చాలా తెలుసు. చాలా సంవత్సరాల క్రితం కౌంటీ తరఫున ఆడిన సచిన్ అడుగుజాడల్లో నడవడం నాకు ఒక అద్భుతమైన అనుభూతి" అని అశ్విన్ తెలిపాడు.
అశ్విన్ 2017, 2019లో వోర్సెస్టర్షైర్, నాటింగ్హామ్షైర్ తరుపున తొమ్మిది ఛాంపియన్షిప్ మ్యాచ్లు ఆడి 54 వికెట్లు పడగొట్టాడు. ఇక, టీమిండియా తరుపున 70 టెస్టులాడిన అశ్విన్ 362 వికెట్లు తీశాడు. స్వదేశంలో ఆడిన 43 మ్యాచ్ల్లో 254 వికెట్లు పడగొట్టడం విశేషం.