
చెన్నై: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా (కొవిడ్ 19) వైరస్ రోజురోజుకూ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. భారత్లో ఇప్పటికే కరోనా వైరస్ కేసులు 100కు పైగా నమోదయ్యాయి. దేశంలో కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం దాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలు గుంపులుగా కలిసుండరాదని, సభలు, సమావేశాల్లో పాల్గొనరాదని హెచ్చరికలు జారీ చేసింది.
మహమ్మారి కరోనా పంజా విసురుతున్నా.. చెన్నై వాసులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారని టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అసహనం వ్యక్తం చేసాడు. కరోనాతో ఏం కాదనే భావనలో చెన్నై వాసులు ఉన్నారేమో అని అశ్విన్ ట్విటర్లో పేర్కొన్నాడు. 'ప్రజలంతా సామాజిక దూరం పాటించాలనే విషయం ఇప్పటికీ చెన్నై వాసుల దృష్టికి వచ్చినట్లు అనిపించడం లేదు. వేసవి వల్ల కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతుందనే భావనలో వారు ఉన్నారేమో. లేదా మాకేం కాదులే అనే ధీమాతోనైనా ఉండాలి' అని అశ్విన్ ట్వీట్లో రాసుకొచ్చాడు.
భారత్లో ఇప్పటివరకు 110 వైరస్ కేసులు నమోదవ్వగా.. ఇద్దరు మృతిచెందారు. మరోవైపు తమిళనాడులో ఒకరు ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా ఇప్పుడు ప్రపంచంలోని 120కి పైగా దేశాలలో వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.5 లక్షల మందికి కరోనా సోకింది. ఇక ఈ మహమ్మారి కారణంగా 5,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం సాధ్యమైన ప్రతి చర్యను తీసుకుంటోంది.
సోషల్ మీడియాలో కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, లోకేష్ రాహుల్, వీవీఎస్ లక్ష్మణ్, సానియా మీర్జా వంటి పలువురు క్రీడాకారులు ముందుకు వచ్చారు. 'అందరం ముందస్తు జాగ్రత్తలు తీసుకొని బాధ్యతాయుతంగా వ్యవహరిద్దాం. కరోనా వైరస్ లక్షణాలు కన్పిస్తే.. వెంటనే పరీక్షలు చేయించుకోండి. ఒకవేళ పరీక్షల్లో పాజిటివ్గా తేలితే.. తక్షణమే స్వీయ నిర్బంధంలోకి వెళ్లండి. తద్వారా ఇతరులకు వ్యాధి సోకకుండా కాపాడిన వారవుతారు. మనమంతా కలిసికట్టుగా పోరాడి కరోనాను పారదోలదాం' అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు.
'ప్రజలందరూ కరోనా వైరస్పై పోరాడేందుకు దృఢచిత్తంతో ముందుకు కదలండి. కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడదాం. అందరూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోండి. ముఖ్యంగా వైరస్ బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమ మార్గం' అని శనివారం ట్విటర్ వేదికగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. కరోనా కారణంగా ఐపీఎల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. గతేడాది జరిగిన వేలంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుంచి అశ్విన్ డిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బదిలీ అయ్యాడు. గతేడాది పంజాబ్ జట్టుకు అశ్విన్ కెప్టెన్గా ఉన్న విషయం తెలిసిందే.