టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఐపీఎల్ రిటైర్మెంట్పై మొదటిసారి నోరు విప్పాడు. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన తర్వాత రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన రవిచంద్రన్ అశ్విన్.. ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను, తన మనసులోని ఆవేదనను పంచుకున్నాడు.
మానసిక అలసట.. భరించలేని వేదన
గతేడాది సీఎస్కేతో గడిపిన సీజన్ తన జీవితంలోనే అత్యంత నిరాశజనకమైనదిగా రవిచంద్రన్ అశ్విన్ అభివర్ణించాడు. "నిజం చెప్పాలంటే.. నేను మరో సీజన్ ఆడగలిగే సామర్థ్యం నాకుంది. కానీ మానసిక ప్రశాంతత లేకపోయింది. ఆ సమయంలో నేను అనుభవించిన వేదన వర్ణనాతీతం. అది చాలా బాధాకరంగా అనిపించింది." అని రవిచంద్రన్ అశ్విన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితుల గురించి ఎక్కువగా మాట్లాడటం కూడా తనకు ఇష్టం లేదని, అది తనను మానసికంగా ఇబ్బంది పెడుతుందని అశ్విన్ పేర్కొన్నాడు.

యాజమాన్యం కోసం త్యాగం
తన రిటైర్మెంట్ నిర్ణయం వెనుక జట్టు ప్రయోజనాలు కూడా ఉన్నాయని రవిచంద్రన్ అశ్విన్ వెల్లడించాడు. "నేను చెన్నైలో నా కెరీర్ ప్రారంభించాను. నా సొంత గడ్డపైనే ముగించాలని నిర్ణయించుకున్నాను. నేను రిటైర్ అవ్వడం వల్ల జట్టు యాజమాన్యానికి ఓ తలనొప్పి తగ్గింది. నన్ను రీటైన్ చేసుకోవాలా లేక రిలీజ్ చేయాలా అనే సందిగ్ధత వారికి ఉండదు. అంతేకాకుండా నా రిటైర్మెంట్ వల్ల వారికి 10 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయి" అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
సీఎస్కే వైఫల్యాలపై ఘాటు విమర్శలు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో సీఎస్కే వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోవడంపై రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో సీఎస్కే ఆటతీరును ఆయన తప్పుబట్టారు. "బౌలర్ల బలానికి తగ్గట్టుగా కాకుండా, వారికి రాని విద్యను (వైడ్ యార్కర్లు) వేయమని ఒత్తిడి తెస్తున్నారు. జేమీ ఓవర్టన్ వంటి బౌలర్లకు యార్కర్లు వేయడం రాదు, కానీ మీరు వారిని అదే వేయమంటున్నారు. ఫలితంగా టిమ్ డేవిడ్ వంటి బ్యాటర్లు ఊచకోత కోశారు" అని రవిచంద్రన్ అశ్విన్ విమర్శించారు. యువ ఆటగాళ్లకు సరైన ప్రాక్టీస్, వాతావరణం కల్పించడంలో జట్టు యాజమాన్యం విఫలమవుతోందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. అనుభవం ఉన్న ఆటగాళ్లను కాదని యువకులపై భారం వేసినప్పుడు వారికి సరైన మార్గనిర్దేశం అవసరమని అశ్విన్ సూచించాడు.