
కటక్లోని బారాబతి స్టేడియంలో ఆదివారం టీమిండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. భారత్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో దక్షిణాఫ్రికా 1-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. సిరీస్లోని మొదటి మ్యాచ్లో దక్షిణాఫ్రికా మరో 5 బంతులు ఉండగానే ఏడు వికెట్ల తేడాతో ఇండియాపై గెలుపొందింది. 212 పరుగుల లక్ష్యాన్ని సైతం దక్షిణాఫ్రికా ఛేదించి తమ జట్టు ఎంత పటిష్ఠంగా ఉందో చాటి చెప్పింది. ఇక దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ రెండో టీ20కి ముందు అతి తక్కువ ఫార్మాట్లో 50క్యాచ్లు పట్టిన రెండవ వికెట్ కీపర్గా నిలవడానికి చేరువయ్యాడు. కేవలం ఒక క్యాచ్ దూరంలో అతను ఉన్నాడు. అతను ఈ ఫీట్ను సాధించగలిగితే ఎంఎస్ ధోని తర్వాత ఈ ఘనత సాధించిన రెండో వికెట్ కీపర్గా అవతరిస్తాడు. అలాగే టీ20 ఫార్మాట్లో 300 సిక్సులను నమోదు చేయడానికి కేవలం అతను రెండు సిక్స్ల దూరంలో ఉన్నాడు.
ఇక తొలి టీ20 మ్యాచ్లో 212పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సౌతాఫ్రికా స్టార్.. కిల్లర్ ది మిల్లర్ (64పరుగులు 31బంతుల్లో 4ఫోర్లు, 5సిక్సర్లు) దడదడలాడించాడుు. రస్సీ వాన్ డర్ డుస్సెన్ (75పరుగులు నాటౌట్ 46 బంతుల్లో 7ఫోర్లు 5 సిక్సర్లు) చివర్లో బౌలర్లపై దండెత్తాడు. దీంతో లక్ష్యం హాంఫట్ అయింది. టీ20ల్లో దక్షిణాఫ్రికాకు ఇదే అత్యధిక ఛేజింగ్. వీరిద్దరి దంచుడుకు టీమిండియా బౌలర్లు అందరూ తేలిపోయారు.
వరుసగా 12 మ్యాచులు గెలిచిన టీమిండియా దక్షిణాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్ గెలిస్తే వరుసగా అత్యధిక టీ20మ్యాచ్లు గెలిచిన జట్టుగా నిలిచేది. కానీ మిల్లర్, డుస్సెన్ టీమిండియా జైత్రయాత్రకు అడ్డుకట్ట వేశారు. నయా కెప్టెన్ రిషబ్ పంత్కు తొలి మ్యాచ్లో ఓటమి స్వాగతం పలికింది. ఇక ఈ మ్యాచ్లో వాన్ డర్ డుస్సెన్ ఇచ్చిన క్యాచ్ను శ్రేయస్ అయ్యార్ మిస్ చేయడం అతి పెద్ద తప్పిదంగా మారింది. ఇక లైఫ్ దక్కడంతో చివర్లో డుస్సెన్ పిచ్చకొట్టుడు కొట్టడంతో సౌతఫ్రికా ఈజీగా గెలిచింది. నేటి మ్యాచ్లోనైనా టీమిండియా ఎలాంటి తప్పిదం చేయకుండా పోరాట పటిమ కనబర్చాలని అభిమానులు కోరుతున్నారు.