
గర్వంగా ఉంది:
ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ తప్పిదాలే సన్రైజర్స్ హైదరాబాద్ గెలుపు అవకాశాల్ని దెబ్బతీశాయని ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ అసహనం వ్యక్తం చేశాడు. 'ఐపీఎల్ 2020 ఆరంభంలో ఎవరూ మమ్మల్ని ప్రధాన పోటీదారుగా భావించలేదు. ముంబై, ఢిల్లీ, బెంగళూరే టైటిల్ ఫేవరెట్స్ అనుకున్నారు. అయినా మా వాళ్లు చక్కటి ప్రదర్శనతో ఇక్కడి వరకు వచ్చాం. అందుకు గర్వంగా ఉంది. ఈ ఐపీఎల్లో నటరాజన్ వెలుగులోకి వచ్చాడు. అతడు చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. ఎప్పటిలానే రషీద్ ఖాన్, మనీశ్ పాండే ఆకట్టుకున్నారు. మొత్తంగా వాళ్లు కూడా రాణించారు' అని వార్నర్ పేర్కొన్నాడు.

క్యాచ్లు పట్టకుంటే ఎలా:
'క్యాచ్లను పట్టలేకపోతే మ్యాచ్లను గెలవలేం. ఇదే ఈ టోర్నమెంట్లో మమ్మల్ని నిరాశపరిచింది. ఈ విషయంపై మరింత దృష్టి పెట్టాలి. గాయాల కారణంగా ప్రధాన ఆటగాళ్లు దూరమైనా.. ఉన్న వనరులతోనే సీజన్లో రాణించాం. అయితే భువనేశ్వర్ కుమార్, వృద్ధిమాన్ సాహాల సేవల్ని కోల్పోవడం టీమ్ని దెబ్బతీసింది' అని వార్నర్ తెలిపాడు. ఢిల్లీ జట్టుకి మెరుగైన స్కోరుని అందించిన శిఖర్ ధావన్ (78: 50 బంతుల్లో 6x4, 2x6), మార్కస్ స్టోయినిస్ (38: 27 బంతుల్లో 5x4, 1x6), షిమ్రాన్ హెట్మెయర్ (42 నాటౌట్: 22 బంతుల్లో 4x4, 1x6) ఇచ్చిన క్యాచ్లను హైదరాబాద్ ఫీల్డర్లు జారవిడిచారు. అంతేకాదు చేతులోకి వచ్చిన బంతులను కూడా ఫోర్లుగా జారవిడిచారు.

భారత్ నాకు రెండో ఇల్లు:
'ఈ రోజు హైదరాబాద్ నగరంలోని ఓ వంతెనపై సన్రైజర్స్ ఫోటో వెలిగిపోతున్నట్లు చూశా. చాలా ఆనందమేసింది. మాకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. మీ ఆదరాభిమానాలను ఎప్పటికీ మర్చిపోను. ఇదివరకు చెప్పను.. ఇప్పుడూ చెపుతున్నా. భారత్ నాకు రెండో ఇల్లు. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ నా కుటుంబం. వచ్చే ఏడాది భారత దేశంలోనే ఐపీఎల్ ఆడవచ్చు. మంచి ప్రదర్శనతో ముందుకు వస్తాం' అని సన్రైజర్స్ సారథి డేవిడ్ వార్నర్ చెప్పాడు.


Click it and Unblock the Notifications












