ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఖతార్ తొండాట ఆడి భారత్పై నెగ్గింది. సరైన గోల్ కాదని భారత ఆటగాళ్లు మ్యాచ్ రిఫరీని అభ్యర్థించినా లాభం లేకపోయింది. రివ్యూకు వెళ్లమని ఎంత నచ్చజెప్పినా మ్యాచ్ రిఫరీ మొండి వైఖరి భారత్ కొంపముంచింది. అంతిమంగా ఫుట్బాల్ ప్రపంచకప్-2026 ఆసియా జోన్ క్వాలిఫయిర్స్ మూడో రౌండ్కు ఇండియా అర్హత సాధించలేకపోయింది.
గ్రూప్-ఏలో భాగంగా ఖతార్ జట్టుతో మంగళవారం భారత్ మ్యాచ్ ఆడింది. మూడో రౌండ్కు అర్హత సాధించాలంటే ఈ పోరులో భారత్ తప్పక నెగ్గాలి. కానీ మ్యాచ్ రిఫరీ చెత్త నిర్ణయంతో ఈ కీలక పోరుతో 1-2తో ఇండియా ఓటమిపాలైంది. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో 72 నిమిషాల పాటు భారత్దే పూర్తి ఆధిపత్యం. 37వ నిమిషంలో లాలియాన్జువాల గోల్ కొట్టి భారత్ ఖాతాను తెరిచాడు. ఆ తర్వాత అదే జోరును ఇండియా ప్రదర్శించిది.

కానీ 73వ నిమిషంలో మ్యాచ్ మారిపోయింది. ఖతార్ ప్లేయర్ యూసఫ్ కొట్టి హెడర్ను భారత గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ నిలువరించాడు. ఆ తర్వాత బంతి గోల్లైన్ దాటి బయటకు వెళ్లింది. కానీ ప్రత్యర్థి ఆటగాడు హష్మీ అల్ హుస్సేన్ లైన్ దాటిని బంతిని వెనక్కి లాగి సహచర ప్లేయర్ యూసఫ్కు పాస్ చేశాడు. యూసఫ్ దాన్ని నెట్లోకి పంపించాడు. దీన్ని గోల్గా మ్యాచ్ రిఫరీ ప్రకటించాడు.
బాల్ లైన్ దాటినట్లు స్పష్టంగా కనిపించినా మ్యాచ్ రిఫరీ ఖతార్కు సపోర్ట్ చేయడం గమనార్హం. రివ్యూకు వెళ్లమని భారత్ ఆటగాళ్లు చేసిన అభ్యర్థనను రిఫరీ పట్టించుకోలేదు. ఆ షాక్లో ఉన్న భారత్ను ఖతార్ దెబ్బతీసింది. 85వ నిమిషంలో గోల్ చేసి 2-1 ఆధిక్యానికి చేరింది. మ్యాచ్ ముగిసేవరకు ఆధిక్యాన్ని కాపాడుకుని విజయం సాధించింది. కాగా, ఖతార్తో పాటు కువైట్ ఆసియా జోన్ క్వాలిఫయర్స్లో మూడో రౌండ్కు అర్హత సాధించింది.