IPL 2025 Punjab kings: ఐపీఎల్ 2025 సీజన్ లో భారీ అంచనాలతో బరిలోకి దిగి చెత్తగా ఆడుతోన్న పంజాబ్ కింగ్స్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్వెల్.. ఈ సీజన్ నుంచి వైదొలిగాడు. రీసెంట్ గానే అతడికి ప్రాక్టీస్ సెషన్ లో గాయమైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అతడి స్థానాన్ని ఓ సెన్సేషనల్ ఆటగాడితో భర్తీ చేసింది పంజాబ్ కింగ్స్ యాజమాన్యం. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
ఇంతకీ అతడెవరంటే
అతడు మరెవరో కాదు ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ ఓవెన్ (Mitchell Oven). ఇతడినే ఇప్పుడు పంజాబ్ జట్టు తీసుకుంది. రూ.3 కోట్లతో అతడిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. బిగ్ బాష్ లీగ్ 2024-25 సీజన్లో తన ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకున్నాడు మిచెల్ ఓవెన్. ఆ సీజన్ లో టాప్ స్కోరర్గా నిలిచాడు మిచెల్. 200 స్ట్రైక్ రేట్తో 452 పరుగులు సాధించాడు. ఈ లీగ్ లో అతడు హోబర్ట్ హరికేన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ జట్టు తొలిసారి విజేతగా నిలవడంలో మిచెల్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం మిచెల్ ఓపెన్ పాకిస్థాన్ సూపర్ లీగ్లో (పీఎస్ఎల్) ఆడుతున్నాడు. పెషావర్ జాల్మీ జట్టు తరఫున ఆడుతున్నాడు. బాబర్ అజామ్ కూడా ఇదే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

UPDATE: Mitchell Owen replaces Glenn Maxwell for the rest of #TATAIPL 2025 season. pic.twitter.com/yX7Z8uamMt
— Punjab Kings (@PunjabKingsIPL) May 4, 2025
ఐపీఎల్ కమిటీ అధికర ప్రకటన..
మిచెల్ ఎంపికపై ఐపీఎల్ కమిటీ కూడా అధికార ప్రకటన విడుదల చేసింది. "ఆల్ రౌండర్ మిచెల్ ఓవెన్ను పంజాబ్ కింగ్స్ తీసుకుంది. గ్లెన్ మ్యాక్స్వెల్ స్థానంలో అతడిని తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మ్యాక్సీ చేతి వేలు ఫ్రాక్చర్ కావడంతో ఐపీఎల్లోని మిగతా మ్యాచులకు అతడు దూరమయ్యాడు. ఇక ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ ఓవెన్ ఇప్పటివరకు కెరీర్ లో 34 టీ20లు ఆడాడు. మొత్తం 646 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి. పది వికెట్లు కూడా తీశాడు" అని పేర్కొంది.