ఐపీఎల్లో ప్రతి టీమ్ పవర్ఫుల్గా కనిపిస్తుంటుంది. ఏ జట్టును తక్కువగా అంచనా వేయలేం. స్టార్ ప్లేయర్లతో టీమ్స్ అన్నీ కలకలలాడుతుంటాయి. కానీ లీగ్లో హోమ్ గ్రౌండ్లో ఆడే జట్టు మాత్రం కాస్త ఫేవరేట్గా ఉంటుంది. తమ సొంతమైదానానికి అనుగుణంగా సత్తాచాటే ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు రూ.కోట్లు కుమ్మరిస్తుంటారు.
సీజన్లో దాదాపు సగం మ్యాచ్లు హోమ్గ్రౌండ్లోనే జరుగుతుంటాయి. వాటిలో పైచేయి సాధించి, ప్రత్యర్థి కోటలో కనీసం ఓ రెండు మ్యాచ్లు గెలిచినా ప్లేఆఫ్స్కు సునాయాసంగా చేరుకోవచ్చని ప్రణాళికతో ఉంటుంటారు. ఐపీఎల్ చరిత్ర కూడా ఇదే చెబుతోంది. అయితే పంజాబ్ కింగ్స్ మాత్రం దీనికి మినహాయింపుగా ఉంది.

అన్ని జట్లు హోమ్ గ్రౌండ్లో చెలరేగుతుంటే పంజాబ్ మాత్రం పరాజయాల్లో చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్లో సొంతమైదానంలో, తటస్థ వేదికలో అత్యధిక ఓటములు చవిచూసిన జట్టుగా పంజాబ్ కింగ్స్ పేలవమైన రికార్డు నెలకొల్పింది. ఈ వేదికల్లో 73 మ్యాచ్ల్లో ప్రత్యర్థి చేతిలో పంజాబ్ ఓడింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిఅనంతరం ఈ కోరుకోని ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డు ఢిల్లీ క్యాపిటల్స్ పేరిట ఉండేది. ఢిల్లీ 72 మ్యాచ్ల్లోఓటమిపాలైంది.
ముల్లాన్పూర్ వేదికగా శనివారం రాజస్థాన్ రాయల్స్తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 147 పరుగులు చేసింది. అశుతోష్ శర్మ (31*; 16 బంతుల్లో, 1x4, 3x6) టాప్ స్కోరర్. లివింగ్స్టోన్ (21; 14 బంతుల్లో, 2x4, 1x6) దూకుడుగా ఆడాడు. మహరాజ్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం రాజస్థాన్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.హెట్మెయిర్ (27*; 10 బంతుల్లో, 1x4, 3x6) విజయంలో కీలకపాత్ర పోషించాడు. యశస్వీ జైస్వాల్ (39; 28 బంతుల్లో, 4x4) టాప్ స్కోరర్. పంజాబ్ బౌలర్లలో కగిసో రబాడ, సామ్ కరన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.