Punjab Kings: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన 18వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్.. 50 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ను వాళ్ల సొంతమైదానంలోనే ఓడించింది. దీంతో పంజాబ్ జట్టు ఈ సీజన్ లో తమ తొలి పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్కు ముందు వరుసగా రెండు విజయాలతో పంజాబ్ లీగ్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయితే ఈ ఘోర పరాజయంతో పాటు అదే రోజు (ఏప్రిల్ 5) ఢిల్లీ క్యాపిటల్స్ గెలవడంతో పంజాబ్ నాలుగో స్థానానికి పడిపోయింది. మరోవైపు రాజస్థాన్ వరుసగా రెండో విజయం నమోదు చేసుకుని ఏడో స్థానానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ ఓటమికి గల మూడు ముఖ్యమైన కారణాలను తెలుసుకుందాం..
1.అది కట్టడి చేయడంలో విఫలం ..
ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు ఫామ్లో లేని యశస్వి జైశ్వాల్ (45 బంతుల్లో 67; 3×4, 5×6) ఈ మ్యాచుతో హాఫ్ సెంచరీ చేసి ఫామ్లోకి వచ్చాడు. అతడికి తోడుగా కెప్టెన్ సంజూ శాంసన్ (38; 26 బంతుల్లో 6×4) కూడా అద్భుతంగా ఆడాడు. అయితే పంజాబ్ జట్టు తమ హోమ్ గ్రౌండ్లో ఫర్వాలేదనిపించే పిచ్ను కలిగినప్పటికీ, రాజస్థాన్ ఓపెనర్లను తొందరగా ఔట్ చేయడంలో విఫలమైంది. దీంతో జైశ్వాల్, సంజూ శాంసన్ కలిసి తొలి వికెట్కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత రియాన్ పరాగ్ కూడా మొదట ఆచితూచి ఆడి, చివర్లో దూకుడు పెంచి స్కోరును 200 దాటించాడు. పంజాబ్ కింగ్స్ పవర్ ప్లే బౌలింగ్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయింది. అర్షదీప్ సింగ్, మార్కో జాన్సన్, లాకీ ఫెర్గూసన్ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేదు. ఇది రాజస్థాన్ విజయానికి బలమైన పునాదిగా మారగా.. పంజాబ్ కు మైనస్ గా మారింది.

2. పవర్ప్లేలో పంజాబ్ అబ్బ..
రాజస్థాన్ ఓపెనర్లు మెరుగ్గా ఆడితే, పంజాబ్ టాప్ ఆర్డర్ మాత్రం పూర్తిగా కుప్పకూలింది. తొలి ఓవర్లోనే జోఫ్రా ఆర్చర్.. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యను ఔట్ చేశాడు. రెండో ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను కూడా బోల్తా కొట్టించాడు. ఇక నాలుగో ఓవర్లో సందీప్ శర్మ.. స్టోయినిస్ను ఔట్ చేశాడు. దీంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 43/3 కాగా, ఏడో ఓవర్లో ప్రభ్సిమ్రన్ సింగ్ను స్పిన్నర్ కుమార్ కార్తికేయ ఔట్ చేశాడు. 50 పరుగుల లోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోవడంతో పంజాబ్ మ్యాచ్ను కోల్పోయే స్థితిలోకి వెళ్లిపోయింది. పంజాబ్ టాప్ ఆర్డర్ కూలడానికి రాజస్థాన్ బౌలర్ల నైపుణ్యం ఒకటైతే, అయ్యర్ బాధ్యతారాహితంగా ఔట్ అయిన తీరు రెండోది.
వరుస బంతుల్లో రెండు కీలక వికెట్లు..
గ్లెన్ మ్యాక్స్వెల్, నెహాల్ వధేరా వరుసగా రెండు బంతుల్లో వికెట్లు కోల్పోయారు. దీంతో కూడా మ్యాచ్ పంజాబ్ చేతుల్లోంచి జారిపోయింది. మహీశ్ తీక్షణ వేసిన 15వ ఓవర్ చివరి బంతికి మ్యాక్స్వెల్ యశస్వి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ వెంటనే 16వ ఓవర్ మొదటి బంతికి నెహాల్ వధేరా.. ధ్రువ్ జురేల్ చేతికి చిక్కి ఔట్ అయ్యాడు.
3. కెప్టెన్ తప్పు.. పిచ్ అంచనా బోల్తా..
ఈ పిచ్ కాస్త స్పిన్నర్లకు అనుకూలంగా ఉంది. కానీ పంజాబ్ జట్టు దీనిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్ లాంటి ఫాస్ట్ బౌలర్ల చేత నాలుగు ఓవర్లు వేయించింది. మీడియం పేస్ బౌలర్ విజయ్ కుమార్ వైశాఖను బెంచ్పై ఉంచింది. స్పిన్నర్లలో యుజ్వేంద్ర చాహల్ను తప్ప మరో స్పెషలిస్ట్ లేకపోవడం చాలా పెద్ద లోపం. ఇదే సమయంలో రాజస్థాన్ స్పిన్నర్లు మాత్రం పిచ్ ను ఉపయోగించుకుని మొత్తం 10 ఓవర్లు వేసి 83 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశారు. ఇక పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలర్ల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు. మెయిన్ పేసర్లను ముందే పూర్తిగా వినియోగించేయడంతో, చివరి ఓవర్ను స్టోయినిస్ చేత వేయించాల్సి వచ్చింది. కానీ మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే సత్తా ఉన్న స్టోయినిస్కు డెత్ ఓవర్ ఇవ్వడం కూడా ఘోరంగా దెబ్బతీసింది. ఆ ఓవర్ లో అతడు సమర్పించుకున్న 19 పరుగులు కూడా రాజస్థాన్ స్కోరు భారీగా పెరిగింది.