
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ అయిన పంజాబ్ కింగ్స్.. ఆ జట్టు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ను తొలగించబోతున్నట్లు మీడియాలో పుకార్లు ఇటీవల రావడంంతో ఆ జట్టు మేనేజ్ మెంట్ ఈ విషయమై స్పష్టతనిచ్చింది. తమ సోషల్ మీడియా వేదకల ద్వారా ఈ మేరకు ఓ మెసేజ్ పోస్ట్ చేసింది. ఇలాంటి నిరాధార వార్తలను ప్రచురిస్తున్ వెబ్ సైట్ల నివేదికలను నమ్మొద్దని తేల్చి చెప్పింది.
'పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్సీకి సంబంధించి ఓ స్పోర్ట్స్ న్యూస్ వెబ్సైట్ ప్రచురించిన వార్తా నివేదికలు గత కొన్ని రోజులుగా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. టీమ్లోని ఏ అధికారి దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని మేము చెప్పాలనుకుంటున్నాం' అని టీం ట్విట్టర్ హ్యాండిల్లో ఈ మేరకు మెసేజ్ పోస్ట్ చేసింది. ఇకపోతే ఐపీఎల్ 2022 ఎడిషన్లో పంజాబ్ జట్టు బలమైన స్క్వాడ్ కలిగి ఉంది. కానీ ఆ జట్టు ఆశించినంత మేర రాణించలేదు. తద్వారా ప్లేఆఫ్ కూడా ఆ జట్టు చేరుకోలేకపోయింది. ఆ జట్టు కెప్టెన్ అయిన మయాంక్ అగర్వాల్ ఈ సీజన్లో పేలవ ఫామ్ కనబరిచాడు. అతను పూర్తిస్థాయిలో విఫలమయ్యాడు. తన పేలవ ఫామ్ నుంచి బయటపడ్డానికి అతనికి అవకాశం చిక్కలేదు. ఇక ఐపీఎల్ సీజన్లో మయాంక్ కేవలం 196 పరుగులే చేశాడు. అతను తన సాధారణ ప్రదర్శన కంటే చాలా తక్కువ స్థాయి ఆడాడు. ఇక టీం మేనేజ్ మెంట్ అతని బ్యాటింగ్ ఆర్డర్ కూడా తగ్గించింది. అయినా అతని ఆటలో మాత్రం ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు.
ఇకపోతే కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు తరఫున కెప్టెన్సీ చేపట్టి పంజాబ్ను వీడడంతో పంజాబ్ జట్టు సారథ్య బాధ్యతలు మయాంక్కు దక్కాయి. ఇకపోతే మయాంక్ కెప్టెన్సీ గురించి కొన్ని రోజుల నుంచి పుకార్లు వ్యాపించాయి. వచ్చే సీజన్లో మయాంక్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించనున్నట్లు వార్తలొచ్చాయి. దీనిపైనే పంజాబ్ ఫ్రాంచైజీ వివరణ ఇచ్చుకుంది. ఇకపోతే పంజాబ్ కోచ్ విషయంలోనూ మార్పుల కోసం చూస్తున్నట్లు సమాచారం. ట్రెవర్ బేలిస్, ఇయాన్ మోర్గాన్లతో ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి.