పంజాబ్ కింగ్స్ సత్తాచాటుతోంది. కాస్త ఆలస్యమైనా ఎట్టకేలకు తిరిగి గెలుపు బాట పట్టింది. వరుసగా రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది. ప్లేఆఫ్స్ అవకాశాలను పంజాబ్ సజీవంగా ఉంచుకుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో గెలిచిన పంజాబ్ అరుదైన రికార్డు సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 162 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (62; 48 బంతుల్లో; 5x4, 2x6) టాప్ స్కోరర్. పంజాబ్ స్పిన్నర్లు రాహుల్ చాహర్ (2/16), హర్ప్రీత్ బ్రార్ (2/17) చెరో రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ మూడు వికెట్లు కోల్పోయి 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని సాధించింది.

రొసో (43; 23 బంతుల్లో, 5x4, 2x6), బెయిర్స్టో (46; 30 బంతుల్లో, 7x4, 1x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. సీఎస్కే బౌలర్లలో శార్దూల్, గ్లీసన్, దూబె తలో వికెట్ తీశారు. కాగా, ఈ క్రమంలో సీఎస్కేపై నెగ్గిన పంజాబ్ కింగ్స్ అరుదైన ఘనత అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్పై వరుసగా అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్తో సమంగా పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. 2021 సీజన్ నుంచి సీఎస్కేతో ఇప్పటివరకు అయిదు మ్యాచ్లు ఆడిన పంజాబ్ అన్నింట్లోనూ విజయఢంకా మోగించింది.
2018-19 మధ్య సీఎస్కేపై ముంబై ఇండియన్స్ కూడా వరుసగా అయిదు మ్యాచ్ల్లో నెగ్గింది. ముంబై, పంజాబ్ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్ (వరుసగా 4 విజయాలు, 2020-21), రాజస్థాన్ రాయల్స్ (వరుసగా 4 విజయాలు, 2021-23) ఉన్నాయి. అంతేగాక పంజాబ్ కింగ్స్ మరో రికార్డు నెలకొల్పింది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ను అత్యధిక సార్లు ఓడించిన రెండో జట్టుగా పంజాబ్ నిలిచింది. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ (5), పంజాబ్ కింగ్స్ (4), కోల్కతా నైట్ రైడర్స్ (3) టాప్లో ఉన్నాయి.