
మొహాలీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 షెడ్యూల్ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆదివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సీజన్ ఐపీఎల్ ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగనుంది. ఇక మే 30వ తేదీన ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.ప్లే ఆఫ్స్తో పాటు ఫైనల్ మ్యాచ్కు మొతేరా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. 52 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో మొత్తం 60 మ్యాచ్లు జరగనున్నాయి.
చెన్నై, ముంబై, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీలో ఐపీఎల్ 2021 మ్యాచ్లు జరుగనున్నాయి. అయితే హైదరాబాద్, పంజాబ్, రాజస్థాన్ ఫ్రాంఛైజీలకు మాత్రం సొంతగడ్డపై ఆడే అవకాశం లేకుండా పోయింది. బీసీసీఐ ఎంపిక చేసిన వేదికల్లో మొహాలీ లేకపోవడంపై పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మొహాలీతో వచ్చిన సమస్య ఏంటని, ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నిస్తూ బీసీసీఐకి ఆయన మంగళవారం ఓ లేఖ రాశారు.
'నేను బీసీసీఐకి లేఖ రాశాను. రోజుకు 9వేల కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న ముంబైలోనే ఐపీఎల్ 2021 మ్యాచ్లు నిర్వహిస్తున్నప్పుడు.. మొహాలీతో వచ్చిన సమస్యేంటి. ఇక్కడ వైరస్ కేసులు తక్కువగా ఉన్నాయి. మేం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం' అని అమరిందర్ సింగ్ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్లోనూ ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లు లేకపోవడంపై క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ కేసులు ఉన్న హైదరాబాద్లో మ్యాచులు ఎందుకు నిర్వహించరని బీసీసీఐపై మండిపడుతున్నారు.
ఐపీఎల్ 2021 మ్యాచుల కోసం మొహాలిని మినహాయించాలని బీసీసీఐ ముందే ప్లాన్ చేసిందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. పంజాబ్లో మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం దేశంలో కొనసాగుతున్న రైతుల నిరసనే అని పేర్కొన్నారు. ఐపీఎల్ టోర్నీపై అంతర్జాతీయ మీడియా దృష్టి సారిస్తుందని, ఒకవేళ నిరసనకారులు ఏదైనా ఆటకం కలిగిస్తే దేశ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంటుందని బీసీసీఐ బయపడిందని సదరు అధికారి చెప్పుకొచ్చారు.
IPL 2021: ఐపీఎల్ డబ్బుతో.. నా కుటుంబం కోసం ఇల్లు కొనాలనుకుంటున్నా: చేతన్
https://telugu.mykhel.com/cricket/chetan-sakariya-says-i-want-to-buy-a-house-for-my-family-with-rajasthan-royals-ipl-contract/articlecontent-pf57553-033667.html