హైదరాబాద్: ఆస్ట్రేలియాతో పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేసర్ ఉమేశ్ యాదవ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ను అవుట్ చేయడం ద్వారా టెస్టుల్లో ఒక ఆటగాడిని అత్యధిక సార్లు అవుట్ చేసిన ఘనతను సాధించాడు.
పూణె టెస్టులో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా 27 ఓవర్ల వరకు నిలకడగా ఆడింది. 27 ఓవర్ల పాటు ఎంత మంది బౌలర్లను మార్చినా వికెట్ పడలేదు. దీంతో కెప్టెన్ కోహ్లీ 28 ఓవర్ను ఉమేశ్ యాదవ్కిచ్చాడు. 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్ను ఉమేశ్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది.
ఉమేశ్ యాదవ్ తన మొదటి ఓవర్లోనే వికెట్ తీయడం విశేషం. తద్వారా ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో వార్నర్ అవుట్ కావడం ఇది ఐదోసారి. తద్వారా ఆసీస్ బౌలర్ షాన్ మార్ష్తో కలిసి ఉమేశ్ యాదవ్ సంయుక్తంగా ఒక బ్యాట్స్ మెన్ని అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.
ఈ టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆరంభంలోనే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఆసీస్ ఇన్నింగ్స్ 15 ఓవర్ చివరి బంతికి వార్నర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. జయంత్ యాదవ్ వేసిన ఆ ఓవర్ ఆఖరి బంతికి వార్నర్ బౌల్డ్ అయినప్పటికీ, అది నో బాల్ అయ్యింది.
దాంతో వార్నర్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు. ఈ సమయంలో కోహ్లీ సైతం అసహనం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత ఉమేశ్ యాదవ్ వేసిన 28 ఓవర్ రెండో బంతికి వార్నర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 82 పరుగుల వద్ద ఆసీస్ తొలి వికెట్ను కోల్పోయింది. మరొ ఓపెనర్ రెన్ షా 36 పరుగుల వద్ద కడుపు నొప్పి రావడంతో రిటైర్డ్ హర్ట్గా పెవిలియన్కు చేరాడు.