
పుణె: ఇష్టమైన క్రికెట్ ఆడుతూనే ఓ క్రికెటర్ క్రీజులోనే మరణించాడు. ఈ సంఘటన పుణెలో చోటు చేసుకుంది. మృతుడు 47 ఏండ్ల బాబు నలవాడేగా గుర్తించారు. పుణెలోని జున్నార్ తహశీల్లో స్థానికంగా మ్యాచ్ ఆడుతున్న నలవాడే.. ఒక్కసారిగా పిచ్పైనే కుప్పకూలిపోయాడు. దాంతో హుటాహుటిన సమీపంలోకి దవాఖానకు తరలించగా మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. క్రికెట్ ఆడుతూ పిచ్పై కుప్పకూలి తుదిశ్వాస విడిచిన క్రికెటర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన చాలా మంది క్రికెట్ అభిమానులు నలవాడేకు ఘనంగా నివాళులర్పించారు.
జున్నార్ తహశీల్లో స్థానికంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా.. నాన్ స్ట్రయికింగ్ ఎండ్లో ఉన్న బాబు నలవాడే.. రన్ తీయడం కుదరక తిరిగి వికెట్ల వద్దకు వచ్చి కూర్చున్నాడు. అనంతరం అక్కడే కింద పడిపోయాడు. తొలుత రిలాక్స్ అవుతున్నాడని భావించిన ఫీల్డ్ అంపైర్.. అనంతరం పరిస్థితి తీవ్రంగా ఉందని ఆయాగాలకు హెచ్చరించాడు. దాంతో తోటి క్రికెటర్లు, అంపైర్లు అతడ్ని చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
గుండె పోటు రావడంతోనే బాబు నలవాడే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. గుండె పోటుకు గురవడంతో క్షణాల్లోనే నలవాడే ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోవడంతో జున్నార్లో విషా దఛాయలు అలుముకున్నాయి. తోటి క్రికెటర్ ఆకస్మికంగా చనిపోవడంతో అక్కడి క్రికెటర్లు కన్నీరు మున్నీరయ్యారు. క్రికెట్తో నలవాడేకు ఉన్న అభిమానంను చూపుతూ బోరున విలపించారు. నారాయణగావ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
నలవాడే నాలుగైదు నెలల క్రితం కరోనా వైరస్ వ్యాధికి గురై చికిత్స పొంది ఆరోగ్యవంతుడిగా తయారయ్యాడు. మైదానాల్లోకి ఆటగాళ్లను వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో ఇటీవలనే నలవాడే తిరిగి క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు తోటి క్రికెటర్లు చెప్పారు. గతంలో కూడా ఇలాగే పలువురు క్రికెటర్లు చనిపోయిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. జనవరి 18 న జరిగిన మరో దురదృష్టకర సంఘటనలో, 25 ఏళ్ల ఓ వ్యక్తి కూడా అచ్చం ఇలాగే ఆట ఆడుతున్నప్పుడు ప్రాణాలు కోల్పోయాడు. మహారాష్ట్రలో రామన్ గైక్వాడ్ అకస్మాత్తుగా నేలపై కుప్పకూలిపోగా సమీపంలోని దవాఖానకు తరలిస్తుండగా మరణించాడు.