
పుణె: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిపై జరుగుతున్న పోరాటంలో తనవంతు పాత్ర పోషించేందుకు పాకిస్థాన్ బ్యాట్స్మన్ అజహర్ అలీ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. తన బ్యాట్, జెర్సీని వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బును కొవిడ్-19 బాధితుల కోసం వెచ్చించాలని నిర్ణయించాడు. 2016లో వెస్టిండీస్తో జరిగిన టెస్టులో 302 పరుగులు చేసిన బ్యాట్ను, 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ధరించిన జెర్సీని నిధుల సమీకరణ కోసం అజర్ వేలానికి ఉంచాడు.
అజహర్ అలీ వేలంలో ఉంచిన బ్యాట్ను భారత్లోని ఓ మ్యూజియం దక్కించుకుంది. వేలంలో బ్యాట్ను పుణెలోని గ్లోరీ క్రికెట్ మ్యూజియం రూ.10లక్షల (పాకిస్థాన్ మారకపు విలువ)కు దక్కించుకుందని అజర్ ప్రకటించాడు. కాలిఫోర్నియాలో ఉంటున్న కాష్ విలానీ రూ.10.10లక్షలకు చాంపియన్స్ ట్రోఫీ షర్టును వేలంలో సొంతం చేసుకున్నట్టు ట్వీట్ చేశాడు. అలాగే న్యూజెర్సీలో ఉంటున్న జమాల్ ఖాన్ కూడా రూ.లక్షను విరాళంగా ఇచ్చారని, అందరికీ ధన్యవాదాలు అంటూ పేర్కొన్నాడు.
బ్యాట్ సహా జెర్సీపైన పాకిస్థాన్ ఆటగాళ్ల సంతకాలు ఉన్నాయి. 2016లో యూఏఈ వేదికగా జరిగిన టెస్టులో త్రిశతకం చేసిన అజర్ అలీ.. డే అండ్ నైట్ టెస్టులో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వేలంలో వచ్చిన ఈ మొత్తాన్ని కరోనా వైరస్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేసేందుకు అజర్ అలీ వినియోగించనున్నాడు.
ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్ కరోనా బాధితుల సహాయార్థం ఇప్పటికే ముందుకొచ్చాడు. కరోనా పై చేస్తున్న పోరాటం కోసం తనకు ఎంతో ఇష్టమైన ప్రపంచకప్ 2019 జెర్సీని బట్లర్ వేలంలో విక్రయించాడు. ఆ జెర్సీకి రూ.60.83 లక్షలు వచ్చాయి. బట్లర్ ప్రపంచకప్ జెర్సీ వేలంకు మొత్తం 82 బిడ్స్ రాగా.. 65,100 పౌండ్లకు ఒకతను కొనుగోలు చేసాడు. వేలంలో వచ్చిన రూ.60.83 లక్షలను లండన్లోని రాయల్ బ్రాంప్టన్, హ్యారీఫీల్డ్ ఆస్పత్రుల ఛారిటీ కోసం వినియోగిస్తానని బట్లర్ తెలిపాడు.
కరోనా వైరస్ను అరికట్టేందకు మద్దతుగా విరాళం అందజేసేందుకు తను ఆడిన చివరి మ్యాచ్లో ధరించిన జెర్సీ, ఆడిన బ్యాట్ను వేలంలో పెడుతున్నట్లు ఇంగ్లండ్ సీనియర్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ప్రకటించాడు. కేప్టౌన్ వేదికగా ఈ ఏడాది జనవరిలో సౌతాఫ్రికాతో అతను చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లో అతను ఏడు వికెట్లు తీయగా.. ఇంగ్లండ్ 189 పరుగుల తేడాతో విజయం సాధించింది.