|
ఐసీసీని సంప్రదించలేదు
ఈ విషయంలో ఇప్పటివరకు ఐసీసీని సంప్రదించలేదని బీసీసీఐ తెలిపింది. అయితే, పాక్తో భారత్ మ్యాచ్ ఆడకూడదని నిర్ణయం తీసుకుంటే... పాక్ మ్యాచ్ ఆడకుండానే పాయింట్లు పొందుతుందని పేర్కొంది. ఇక, ఫైనల్లో భారత్-పాక్ తలపడాల్సి వస్తే... పాక్ మ్యాచ్ ఆడకుండానే వరల్డ్ కప్ గెలుస్తుందని బీసీసీఐ పేర్కొంది. ఈ విషయంపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని, వరల్డ్కప్కు కొద్ది రోజుల ముందు దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో జవాన్ల కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడితో దేశమంతా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.
40మందికి పైగా జవాన్లు వీరమరణం
ఈ దాడిలో 40మందికి పైగా జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దాడితో దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగిలాయి. దీనికి దాయాది దేశం పాకిస్థానే కారణమంటూ ప్రజలంతా ఆందోళనలు చేపట్టారు. ఇప్పటికే పాక్ క్రికెటర్ల ఫోటోలను వివిధ రాష్ట్ర క్రికెట్ సంఘాలు తీసేసిన సంగతి తెలిసిందే.
భారత్-పాక్ మ్యాచ్పై ఐసీసీ చీఫ్ ఇలా
మరోవైపు భారత్-పాక్ మ్యాచ్పై ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ స్పందించారు. "పుల్వామా ఉగ్రదాడి ఘటనలో బాధితులైన వారికి మా తరఫున కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుతం ఈ విషయంపై ఐసీసీ సభ్య దేశాలతో కలిసి పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఇప్పటి వరకైతే మ్యాచ్ల నిర్వహణలో ఎలాంటి మార్పు లేదు. అన్ని మ్యాచ్లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి" అని అన్నారు.
జూన్ 16న భారత్-పాక్ మ్యాచ్
"నా దృష్టిలో అన్ని వర్గాల ప్రజలను ఏక తాటిపై తెచ్చే సామర్థ్యం ఒక్క క్రీడలకే ఉంది. కాబట్టి దీనిపై మరింతగా చర్చిస్తాం" అని రిచర్డ్సన్ స్పష్టం చేశారు. వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జూన్ 16న మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.