టీమిండియా టెస్టు స్టార్ క్రికెటర్ చెతేశ్వర్ పుజారా సూపర్ ఫామ్లో ఉన్నాడు. రంజీట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున పరుగుల వరద పారిస్తున్నాడు. సెంచరీల మోత మోగిస్తున్నాడు. అంతేగాక తన బ్యాటింగ్ శైలిని మార్చుకున్నాడు. పుజారా అంటే క్రికెట్ లవర్స్కు గుర్తొచ్చేది బలమైన డిఫెన్స్. ఎంతటి ప్రమాదకర బౌలర్ను అయినా తన డిఫెన్స్తో నిస్సహాయులుగా మారుస్తాడు.
కానీ, రంజీ ట్రోఫీలో మణిపుర్ జట్టుపై పుజారా దూకుడుగా పరుగులు సాధించాడు. 105 బంతుల్లో 108 పరుగులు చేసి ఔటయ్యాడు. 12 ఫోర్లు, ఒక సిక్సర్తో 102.86 స్ట్రైక్రేటుతో చెలరేగాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన పుజారా తన శైలికి విరుద్ధంగా బౌండరీల మోత మోగించడం విశేషం. పుజారా సూపర్ సెంచరీకి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్ను 529/6 డిక్లేర్ చేసింది. ప్రెరక్ మన్కడ్ (173; 173 బంతుల్లో), అర్పిత్ వాసవాడ (148; 197 బంతుల్లో) శతకాలు సాధించారు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పుజారాకు ఇది 63వ సెంచరీ. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడి కంటే అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లు ముగ్గురే ఉన్నారు. సునీల్ గవాస్కర్ (81), సచిన్ టెండూల్కర్ (81), రాహుల్ ద్రవిడ్ (68) సెంచరీలు సాధించారు. కాగా, 36 ఏళ్ల పుజారా టీమిండియాకు దూరమై దాదాపు ఎనిమిది నెలలు దాటింది. గతేడాది జరిగిన వరల్ట్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో చివరిగా ఆడాడు. ఆ తర్వాత అతడిని పక్కనపెట్టారు. శుభ్మన్ గిల్కు మూడో స్థానంలో అవకాశం ఇచ్చారు. ఓపెనర్గా సత్తాచాటిన గిల్ వన్డౌన్లో విఫలమయ్యాడు. మొత్తంగా లయ అందుకుని వైజాగ్ టెస్టులో సెంచరీ సాధించాడు.
మరోవైపు పుజారా టీమిండియాలో తిరిగి చోటు సంపాదించాలని రంజీ ట్రోఫీలో కసిగా పరుగులు సాధిస్తున్నాడు. ఇటీవల రాజస్థాన్పై 110 పరుగులు సాధించాడు. అంతేగాక ఈ సీజన్లో పుజారా డబుల్ సెంచరీ బాదాడు. 243 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. హర్యానా జట్టుపై 49, 43 పరుగులు, విదర్భపై 43, 66 పరుగులు చేశాడు. సర్విసెస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 91 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. కానీ యువ ప్లేయర్లు కుదురుకోవడం కోసం పుజారాకు సెలక్టర్లు మొండిచేయి చూపిస్తున్నారు. 103 టెస్టుల్లో పుజారా 43 సగటుతో 7195 పరుగులు చేశాడు. 19 సెంచరీలు, మూడు డబుల్ సెంచరీలు సాధించాడు.