
హైదరాబాద్: బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ఐపీఎల్ వేలంలో టీమిండియా టెస్టు బ్యాట్స్మన్ ఛటేశ్వర్ పుజారాను వేలంలో ఏ ప్రాంఛైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేలంలో అమ్ముడుపోని పుజారా గతేడాది లాగే కౌంటీల బాట పట్టనున్నాడు.
వరుసగా రెండో సారి ఐపీఎల్ వేలంలోనూ పుజారాకు నిరాశే ఎదురైంది. గతేడాది ఐపీఎల్లో ఆడే అవకాశం లేకపోవడంతో పుజారా ఇంగ్లాండ్ వెళ్లి కౌంటీల్లో ఆడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో కోహ్లీసేన ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో కౌంటీలు మేలు చేస్తాయని పూజారా భావిస్తున్నాడు.
యార్క్షైర్ జట్టు సైతం తమ వెబ్సైట్లోపుజారా కౌంటీ క్రికెట్ ఆడే అవకాశం ఉందని పేర్కొంది. కౌంటీ క్రికెట్ ఆడటంపై పుజారా సైతం ఆనందం వ్యక్తం చేశాడు. 'మళ్లీ యార్క్షైర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. యార్క్షైర్ ఆటగాళ్లకు ఆట పట్ల ఉన్న నిబద్ధత నాకు చాలా ఇష్టం' అని అన్నాడు.
'నేను నా సహజమైన ఆట ఆడటానికే ప్రయత్నిస్తూ క్లబ్ తరుపున అత్యధిక పరుగులు చేస్తాను. యువరాజ్, సచిన్లా నేను కౌంటీ ఆడటం గౌరవంగా భావిస్తున్నా. కౌంటీ ఆడిన ప్రతిసారి నా ఆట మెరుగవుతుంది. నా అనుభవాన్ని ఉపయోగించి సాధ్యమైనన్ని పరుగులు చేస్తాను' అని పుజారా తెలిపాడు.
ఏప్రిల్, 2015లో పాకిస్థాన్ ఆటగాడు యూనిస్ ఖాన్ స్థానంలో యార్క్షైర్ జట్టుకు పుజారా సంతకం చేశాడు. ఆ సీజన్లో నాలుగు మ్యాచ్లాడిన పుజారా 52.80 యావరేజితో 264 పరుగులు చేశాడు. ఆ తర్వాత కౌంటీల్లో డెర్బీషైర్, నాటింగ్హామ్షైర్ జట్ల తరుపున ఆడాడు.
2017 కౌంటీ సీజన్లో నాటింగ్హామ్షైర్ తరుపున ఆడిన పుజారా 27.75 యావరేజితో 333 పరుగులు నమోదు చేశాడు. 1992లో ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్లో ఆడిన మొట్టమొదటి విదేశీ క్రికెటర్గా సచిన్ టెండూల్కర్ నిలిచాడు. అప్పట్లో సచిన్ యార్క్షైర్ జట్టు తరుపున ఆడాడు. ఆ తర్వాత 2003లో యువరాజ్ సింగ్ అదే జట్టు తరుపున 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లాడాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.