
WTC ఫైనల్ ఓటమితో పునాదులు
టీమిండియా కెప్టెన్సీ హోదాలో విరాట్ కోహ్లీ తిరుగులేని శక్తి ఎదిగాడనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఎంతటి ఆటగాడికైనా ఏదో ఒక రోజు జట్టులో వ్యతిరేక పవనాలు వీచడం ప్రారంభమవుతాయి. విరాట్ కోహ్లీ విషయంలోనూ అదే జరిగినట్లు అర్థమవుతోంది.
నిజానికి భారత కెప్టెన్సీ మార్పు విషయం 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఓటమి అనంతరమే తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో భారత జట్టు ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో సెలెక్టర్లు కోహ్లీ కెప్టెన్సీపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో అప్పుడే కెప్టెన్సీ మార్పునకు పునాదులు పడ్డాయని తెలుస్తోంది.

పుజారా, రహానే ఫిర్యాదు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా వెటరన్ బ్యాటర్లు అయినా చటేశ్వర్ పుజారా, అజింక్యా రహానే ఘోరంగా విఫలమయ్యారు. అయితే వారు అంతకు ముందు నుంచే సరైన ఫామ్లో లేరు. దీంతో ఫైనల్ మ్యాచ్ ఓటమి అనంతరం పుజారా, రహానే వైఫల్యంపై డ్రెస్సింగ్ రూంలో విరాట్ కోహ్లీ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
పుజారా, రహానేను ఎదురుగానే వారిని దూషించాడని తెలుస్తోంది. ఇద్దరు పెద్ద స్కోర్లు చేయలేకపోతున్నారని, పుజారా స్ట్రైక్రేట్ దారుణంగా ఉందని, రహానే ఎక్కువగా సింగిల్ డిజిట్కే పరిమితవుతున్నాడని అందుకే జట్టు భారీ స్కోర్ చేయలేక పోతుందని ఆవేశంతో కోహ్లీ అరిచేశాడట. దీంతో పుజారా, రహానే తమ పట్ల కోహ్లీ ప్రవర్తించిన విధానంపై బీసీసీఐ పెద్దలకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. అప్పుడే కోహ్లీని బీసీసీఐ మందలించిందని సమాచారం.

కోహ్లీ ప్రయత్నాలకు అడ్డు
రెండు, మూడేళ్లుగా విఫలమవుతున్న పుజారా, రహానేను నిజానికి సౌతాఫ్రికా పర్యటకు ఎంపిక చేయడం పట్ల కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడట. సిరీస్ జరుగుతున్న సమయంలో పుజారా, రహానేను జట్టులోకి తీసుకోవడానికి కూడా కోహ్లీ అంతగా ఆసక్తి కనబరచలేదని సమాచారం. వారిద్దరి స్థానంలో యువ ఆటగాళ్లైనా శ్రేయస్ అయ్యర్, హనుమ విహారీని జట్టులోకి తీసుకునేందుకు విరాట్ ప్రయత్నించాడట. అయితే కోహ్లీ ప్రయత్నాలకు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్తో పాటు జట్టు మేనేజ్మెంట్ అడ్డుపడిందని తెలుస్తోంది. దీంతో సఫారీ పర్యటనలో పుజారా, రహానే ఘోరంగా విఫలమవడంతో టీమిండియా సిరీస్ గెలవలేకపోయింది.

అందుకే తప్పుకున్న కోహ్లీ
హెడ్ కోచ్గా రవి శాస్త్రి పదవి కాలం ముగిసి పోవడంతోనే కెప్టెన్గా కోహ్లీ టైమ్ కూడా అయిపోయిందని చెప్పుకోవాలి. అగ్రెసివ్ కెప్టెన్ అయినా కోహ్లీకి, కూల్ వ్యక్తి అయినా కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్కు మధ్య సఖ్యత కుదరలేదని తెలుస్తోంది. దీనికి తోడు జట్టులోని కొందరు ఆటగాళ్లు కోహ్లీ తీరుపై బీసీసీఐతోపాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్కు ఫిర్యాదు చేశారని సమాచారం. దీంతో కెప్టెన్ అయినప్పటికీ కోహ్లీ నిర్ణయాలను మేనేజ్మెంట్ పట్టించుకోకుండా జట్టులో తమ నిర్ణయాలనే అమలు చేసిందట. దీంతో తీవ్ర మనో వేదనకు గురైన విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి గుడ్బై చెప్పాడని సమాచారం.

కోహ్లీని తప్పించాలని నిర్ణయం
సఫారీ పర్యటలో టీమిండియా ఓడిపోతే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని సెలెక్టర్లు ముందే నిర్ణయించుకున్నారని తెలిసింది. అలాగే సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు ఓడిపోయింది. దీంతో మరోసారి సెలెక్టర్లతో అవమానకర రీతిలో వేటు వేయించుకోవడం కన్నా తనే తప్పుకోవడం బెటర్ అనే ఉద్దేశ్యంతో కోహ్లీ తప్పుకున్నాడని సమాచారం. కాగా టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ కోహ్లీపై సెలక్టర్లు గతంలో వేటు వేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












