ముఖ్యమైన టోర్నీలు జరిగినప్పుడు టీమిండియా గెలవాలని భారత క్రికెట్ అభిమానులు ప్రార్థనలు చేయడం, పూజలు చేయడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఫ్యాన్స్.. ఆలయాల్లో పూజలు చేయడం, ఆటగాళ్ల ఫొటోలు పట్టుకుని పూజల్లో పాల్గొనడం, శంఖాలు ఊదడం, భగవంతునికి హారతులు ఇవ్వడం.. ఇలా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మరోసారి భారత్ - పాక్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా అభిమానులు పూజలు చేశారు. ముఖ్యంగా మహాకుంభమేళా ప్రయాగ్ రాజ్లో టీమిండియా అభిమానులు.. పాక్ పై భారత్ గెలవాలని నది ఒడ్డును ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
గెలిస్తే ఆశలు సజీవం...
ప్రస్తుతం దేశంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫీవర్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అందరి ఆశలు టీమిండియా విజయంపైనే ఉన్నాయి. ఇప్పటికే భారత జట్టు తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిచి విజయోత్సాహంలో ఉంది. అదే జోష్ తో పాక్ తో తలపడేందుకు బరిలోకి దిగింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇది పాకిస్థాన్ కు అత్యంత కీలక మ్యాచ్. ఎందుకంటే తన తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ పై ఓడిన దాయాది జట్టు.. ఇప్పుడు జరగబోయే ఈ చావోరేవో మ్యాచ్ లో గెలిస్తేనే, సెమీస్ ఆశల్ని సజీవం చేసుకునే అవకాశం ఉంది. అందుకే పాక్ జట్టు కసితో ఉంది.

జీతేగా.. పాకిస్థాన్ పై భారత్ జీతేగా..
ఇదే సమయంలో భారత జట్టు కూడా పట్టుదలతో ఈ మ్యాచ్ కోసం సిద్ధమైంది. గత ఛాంపియన్స్ ట్రోఫీ (2017) ఫైనల్ లో పాక్ పై ఎదురైన ఓటమికి రివెంజ్ తీసుకుని... ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే జీతేగా భాయ్ జీతేగా.. పాక్ పే టీమిండియా జీతేగా.. అంటూ దేశవ్యాప్తంగా అభిమానులు నామస్మరణ చేస్తున్నారు. కొంతమంది ప్రత్యేక పూజలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అందులో భాగంగానే మహాకుంభమేళా ప్రయాగ్ రాజ్లో పలువురు క్రికెట్ అభిమానులు గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడు, నందీశ్వరుడికి హారతులు ఇచ్చి ప్రార్థించారు.