భారత దిగ్గజ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. గుజరాత్లోని జామ్నగర్లో మార్చి 1న ప్రారంభమైన ఈ వేడుకకు దేశవిదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. సంపన్నులు, సెలబ్రెటీలతో పాటు ప్రముఖ క్రికెటర్లు పాల్గొన్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, మహేంద్ర సింగ్ ధోనీ, ఇషాన్ కిషన్, సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్ హాజరయ్యారు. విదేశీ క్రికెటర్లు కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, ట్రెంట్ బోల్ట్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, రషీద్ ఖాన్, సామ్ కరన్ వేడుకలో పాల్గొన్నారు.

అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల ప్రీవెడ్డింగ్ కోసం పొలార్డ్ పాకిస్థాన్ సూపర్ లీగ్ను అర్ధంతంరంగా వదిలేసి మరీ వచ్చాడు. పాకిస్థాన్ లీగ్లో కరాచీ కింగ్స్కు పొలార్డ్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరాచీ యాజమాన్యానికి పొలార్డ్ చెప్పిన కారణం నెట్టింట్లో వైరల్గా మారింది. కడుపునొప్పి సాకు చెప్పి పొలార్డ్ భారత్కు రావడం గమనార్హం.
లీగ్లో భాగంగా ఆదివారం ముల్తాన్ సుల్తాన్స్తో కరాచీ కింగ్స్ తలపడింది. టాస్ సందర్భంగా కరాచీ కింగ్స్ కెప్టెన్ షాన్ మసూద్ మాట్లాడాడు. పొలార్డ్ గైర్హాజరీ గురించి వివరణ ఇచ్చాడు. కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న పొలార్డ్ జట్టుకు దూరమయ్యాడని తెలిపాడు. 'జట్టులో కొన్ని బలవంతపు మార్పులు చేయాల్సి వచ్చింది. కడుపులో ఇన్ఫెక్షన్తో పోరాడుతున్న పొలార్డ్ తుదిజట్టులో లేడు' అని కెప్టెన్ మసూద్ టాస్ అనంతరం పేర్కొన్నాడు.
పొలార్డ్ గురించి షాన్ మసూద్ పేర్కొన్న వ్యాఖ్యలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. స్కూల్ పిల్లాడిలా కడుపు నొప్పి కారణం చెప్పి పాకిస్థాన్ సూపర్ లీగ్ను ఫ్రాంచైజీలను పొలార్డ్ బురిడీ కొట్టించాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు పొలార్డ్ లేని లోటు కరాచీ కింగ్స్లో స్పష్టంగా కనిపిస్తోంది. ముల్తాన్ సుల్తాన్స్తో జరిగిన మ్యాచ్లో కరాచీ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ సీజన్లో ఆరు మ్యాచ్లు ఆడిన కరాచీ కింగ్స్ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉంది.