
పాకిస్తాన్ సూపర్ లీగ్లో ప్రపంచ రికార్డులు బద్దలయ్యాయి. ఈ లీగ్లో జరిగిన 28వ మ్యాచ్లో ఎన్నో రికార్డులు చెరిగిపోయాయి. ఈ మ్యాచ్లో క్వెట్టా గ్లాడియేటర్స్, ముల్తాన్ సుల్తాన్స్ జట్టు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా ఉస్మాన్ ఖాన్ రెచ్చిపోయాడు. కేవలం 43 బంతుల్లోనే 120 పరుగులు చేశాడు. అలాగే కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ కూడా ధాటిగా ఆడాడు. మొత్తం 29 బంతులు ఎదుర్కొన్న అతను 55 పరుగులతో ఆకట్టుకున్నాడు. టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్ కూడా రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం మూడు వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో క్వెట్టా గ్లాడియేటర్స్ కూడా ధాటిగా ఆడారు. ఒమైర్ యూసుఫ్ (67), ఇఫ్తికర్ అహ్మద్ (53), మార్టిన్ గప్తిల్ (37) ధాటిగా ఆడారు. కానీ చివర్లో వేగంగా ఆడలేకపోయిన గ్లాడియేటర్స్ టార్గెట్ ఛేజ్ చేయలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 253 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో మొత్తం 515 పరుగులు నమోదయ్యాయి. దీంతో ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు నమోదైన టీ20 మ్యాచ్గా ఇది రికార్డుగా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు సీఎస్ఏ టీ20 ఛాలెంజ్లో జరిగిన మ్యాచ్ పేరిట ఉంది.
ఈ మ్యాచ్లో నైట్స్, టైటాన్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన నైట్స్ జట్టు ఏకంగా 271 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో తడబడిన టైటాన్స్ కేవలం 230 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో మొత్తం 501 పరుగులు నమోదయ్యాయి. ఇప్పుడు పీఎస్ఎల్ గేమ్ ఈ రికార్డును బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్ చూసిన ఫ్యాన్స్ కూడా చాలా సంతోషిస్తున్నారు. బౌలర్లు తేలిపోయినా బ్యాటర్లు మాత్రం కావలసినంత ఎంటర్టైన్మెంట్ పంచారని అంటున్నారు.