PSL 2026: పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL 2026) 2026 సీజన్ ఆరంభమే వివాదాలతో సాగుతోంది. పీఎస్ఎల్ 11వ సీజన్ భారీ అంచనాల మధ్య ప్రారంభమైనప్పటికీ.. నిర్వహణ లోపాలు, వివక్షపూరిత నిర్ణయాల వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ లాహోర్ ఖలందర్స్, కొత్త జట్టు హైదరాబాద్ కింగ్స్మెన్ మధ్య జరిగిన మ్యాచ్లో క్రికెట్ కంటే ఎక్కువగా వీఐపీ కల్చర్, చెత్త బ్రాడ్కాస్టింగ్ గురించే చర్చ నడిచింది.
వెలవెలబోయిన స్టేడియం
ఈ ఏడాది పాకిస్థాన్ సూపర్ లీగ్ 6 జట్ల నుంచి 8 జట్లకు విస్తరించింది. హైదరాబాద్ కింగ్స్మెన్, సియాల్కోట్ రావల్పిండీస్ అనే రెండు కొత్త జట్లు చేరడంతో ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ తర్వాత 8 జట్లు ఉన్న మూడో అతిపెద్ద లీగ్గా పీఎస్ఎల్ నిలిచింది. అయితే ఈ చారిత్రాత్మక మార్పును ఎంజాయ్ చేసేందుకు స్టేడియంలో ఒక్క అభిమాని కూడా లేకపోవడం గమనార్హం.

నకిలీ అరుపుల గోల.. ఫ్యాన్స్ ఆగ్రహం
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పాకిస్థాన్లో నెలకొన్న ఇంధన సంక్షోభం దృష్ట్యా.. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ సీజన్ మ్యాచ్లన్నింటినీ ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే టీవీ బ్రాడ్కాస్టింగ్ సమయంలో స్టేడియంలో జనం ఉన్నట్లుగా నకిలీ అరుపులు ప్లే చేయడం అభిమానులను విస్మయానికి గురిచేసింది. ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నా.. రికార్డెడ్ శబ్దాలు పెట్టడం చికాకు కలిగిస్తోందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
వీఐపీలకేనా రూల్స్?
సామాన్య ప్రజలకు స్టేడియంలోకి అనుమతి లేదని చెబుతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. వీఐపీల విషయంలో మాత్రం వెనకడుగు వేసింది. పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ షరీఫ్, పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వంటి ప్రముఖులు స్టాండ్స్లో కూర్చుని మ్యాచ్ను వీక్షించడంపై అభిమానులు భగ్గుమంటున్నారు. "ఇది కేవలం వీఐపీల కోసమే నిర్వహిస్తున్న లీగ్" అంటూ పాక్ అభిమానులే తమ సొంత లీగ్ను ఎద్దేవా చేస్తున్నారు.