"ప్రపంచం మొత్తం స్వార్థంతో నిండిపోయింది. అంతా స్వార్థపరులే. అసలు క్రికెట్ ప్రపంచంలో నిజాయతీ లేదు.ఇకపై ఎప్పటికీ నేను ఏ ఫ్రాంఛైజీకి ఆడాను. బాయ్ కాట్ చేస్తా. రిటైర్ అయిపోతున్నాను. నేనేంటో దేశవాలీ క్రికెట్ ఆడి చూపిస్తా." అని ఛాలెంజ్ చేశాడో క్రికెటర్.
తీరా కట్ చేస్తే ఒక్కరోజు కూడా కాలేదు ఈ వ్యాఖ్యలు చేసి. అంతలోనే మనుసు మార్చుకున్నాడు సదరు క్రికెటర్. "నేను తిరిగొచ్చేసా, ఏదో ఫ్లోలో అనేశాం. చెప్పింది చేసేస్తామా ఏంటి" అని అంటున్నాడు ఇప్పుడా క్రికెటర్. అలా తాజాగా తన రిటైర్మెంట్ డెసిషన్ పై యూటర్న్ తీసుకున్నాడు. అతడు మరెవరో కాదు పాకిస్థాన్ పేస్ సెన్సేషన్ ఇహ్సానుల్లా.

"రిటైర్మెంట్ ఇవ్వాలని నాకు ఎలాంటి ఆలోచన లేదు. ఎమోషన్ లో నిన్న అలా ప్రకటించేశాను. పీఎస్ఎల్ డ్రాఫ్ట్స్ లో నన్ను ఎవరూ తీసుకోకపోయేసరికి నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నా హెడ్ తో గొడవ అయింది. ఆ ఫ్రస్టేషన్ లోనే రిటైర్మెంట్ చేస్తున్నానని అన్నాను. తప్పైపోయింది క్షమించండి." అని పేర్కొన్నాడు.
తమ మాజీ ఫ్రాంఛైజీ ముల్తాన్ సుల్తాన్స్ మరో అవకాశం ఇస్తే, పీఎస్ఎల్ ఆడుతానని ఆశాభావం వ్యక్తం చేశాడు ఇహ్సానుల్లా. భవిష్యత్ లో తన సేవలు ఎప్పుడు కావాలన్నా, అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు.
కాగా, ఇహ్సానుల్లా పీఎస్ఎల్ 2023లో అద్భుతంగా రాణించాడు. తన ఫ్రాంఛైజీ ఫైనల్ కు అర్హత సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. 7.59 ఎకనామీతో 22 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్ అవార్డను గెలుచుకున్నాడు. తన అద్భుతమైన ప్రదర్శనతో జాతీయ జట్టుకు కూడా ఎంపికయ్యాడు. ఐదు వైట్ బాల్ మ్యాచెస్ ఆడాడు. 2023లోనే న్యూజిలాండ్ పై హోమ్ సిరీస్ కూడా ఆడాడు. కానీ గాయం వల్ల సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో అతడు జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే పీఎఎస్ లోని ఫ్రాంఛైజీలు కూడా అతడిని పక్కనపెట్టాయి. ఎవరూ కూడా కొనుగోలు చేయలేదు.