IPL VS PSL: పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. ఈ సామెత పాకిస్థాన్ క్రికెట్ కు సరిగ్గా సరిపోతుంది. ప్రతీ దాంట్లో భారత్ తో పోటీ పడే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. ప్రస్తుతం ఐపీఎల్కు పోటీగా పీఎస్ఎల్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ కన్నా పీఎస్ఎలే గొప్ప, తమ లీగ్ కే క్రేజ్ ఎక్కువ అని డబ్బా కొట్టుకుంటూ ఉంటోంది. అలా ఈ సారి పట్టుబట్టి మరీ కావాలనే.. పాకిస్థాన్ సూపర్ లీగ్ - 2025 (పీఎస్ఎల్) సీజన్ను.. ఐపీఎల్ టైమ్లోనే నిర్వహిస్తోంది. రీసెంట్ గానే పీఎస్ఎల్ కొత్త సీజన్ ఏప్రిల్ 11న ప్రారంభమైంది. అయితే ఇప్పుడు పీఎస్ఎల్కు గట్టి దెబ్బ తగలింది. దీంతో క్రికెట్ అభిమానుల ముందు నవ్వుల పాలైంది.
ఏం జరిగిందంటే?
తాజాగా పీఎస్ఎల్ 2025లో భాగంగా.. కారాచీ నేషనల్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఇందులో డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని కరాచీ కింగ్స్ - రిజ్వాన్ సారథ్యంలోని ముల్తాన్ సుల్తాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచులో రిజ్వాన్ సెంచరీతో మెరిసినా వృథా అయిపోయింది. కరాచీ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. అయితే ఇప్పటివరకు పీఎస్ఎల్ 2025లో మూడు మ్యాచులు జరగగా.. ప్రేక్షకాదరణ కరువైంది. కనీసం బడా జట్లు పోటీ పడ్డ కరాచీ కింగ్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్ మ్యాచుకు కూడా ఆదరణ కరువైంది.

5వేల మంది కోసం 6700 మంది..
ఈ మ్యాచుకు కేవలం 5 వేల మంది ప్రేక్షకులే హాజరయ్యారు. కానీ ఇక్కడ ఫన్నీ విషయం ఏంటంటే ఈ 5 వేల మంది ప్రేక్షకుల భద్రత కోసం 6700 మంది సిబ్బందిని మోహరించడం. అంటే.. ఎక్కువ మంది ప్రేక్షకులు స్టేడియానికి వస్తారనుకుని.. అంత పెద్ద మొత్తంలో భద్రత సిబ్బందిని మోహరించారు. కానీ అది కాస్త తుస్సుమంది. దీంతో మైదానంలో ఆడియెన్స్ కన్నా సెక్యురిటీ సిబ్బందే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడీ విషయం కూడా నెట్టింట్ మీమర్స్ కు మంచి స్టఫ్ దొరికినట్టైంది. ఎందుకంటే ఎప్పుడూ తమ సొంత డబ్బా కొట్టుకునే పాకిస్థాన్ క్రికెటర్లకు కౌంటర్లు వేస్తూ... పీసీబీని, పీఎస్ఎల్ ను తెగ ట్రోల్ చేస్తున్నారు మీమర్స్.
పైగా ఆ మధ్యలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్... పీఎస్ఎల్ మొదలైతే.. ప్రేక్షకులు ఐపీఎల్ చూడటం ఆపేస్తారని కామెంట్లు కూడా చేశాడు. పీఎస్ఎల్ చూడటానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారని వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడీ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. అతడిని ఓ ఆట ఆడేసుకుంటున్నారు క్రికెట్ అభిమానులు.