
జూన్ 9 నుంచి పీఎస్ఎల్ 2021:
జూన్ 9 నుంచి పీఎస్ఎల్ ఆరవ సీజన్ పునః ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. కెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ఆడనున్న ఫాఫ్ డుప్లెసిస్ తాజాగా క్రికెట్ పాకిస్తాన్కు ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఎంఎస్ ధోనీ, సర్ఫరాజ్ అహ్మద్, విరాట్ కోహ్లీల కెప్టెన్సీపై ఫాఫ్ స్పందించాడు. ధోనీ, సర్ఫరాజ్ల కెప్టెన్సీని పోల్చే క్రమంలో కోహ్లీ సారథ్యం గురించి కూడా మాట్లాడాడు. ధోనీ, సర్ఫరాజ్ల కెప్టెన్సీ శైలి వేరని.. ఒకరితో ఒకరిని పోల్చలేమని చెప్పాడు. ఫాఫ్ దక్షిణాఫ్రికా తరఫున 69 టెస్టులు, 143 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. ఇక 91 ఐపీఎల్ మ్యాచులు కూడా ఆడాడు.

ధోనీకి భిన్నంగా ఉంటాడు:
'ఎంఎస్ ధోనీ, సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీ విధానాలు ప్రత్యేకమైనవి. ధోనీ ప్రశాంతంగా ఉంటూనే ఒంటరిగా ఆలోచిస్తాడు. అప్పటికప్పుడు మైదానంలో నిర్ణయాలు తీసుకుంటాడు. అవి అద్భుత ఫలితాలు కూడా ఇస్తాయి. సర్ఫరాజ్ పూర్తిగా ధోనీకి భిన్నంగా ఉంటాడు. మరోవైపు అతడు విరాట్ కోహ్లీలా కనిపిస్తాడు. సర్ఫరాజ్ ఎప్పుడూ సహచరులతో మాట్లాడుతూ నిర్ణయాలు తీసుకుంటాడు. జట్టును ఎలా నడిపించాలనే పట్టుదలతో ముందుకు సాగుతాడు. మైదానంలోనూ అదే బయటకు చూపిస్తాడు. ఒక్కోసారి అతడి హ్యూహాలు ఫలించకపోవచ్చు. ఒకరు కరెక్టు, మరొకరు కాదని ఏదీ లేదు. ఎవరి కెప్టెన్సీ వాళ్లది. సర్ఫరాజ్ ఇప్పటికే పాకిస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. దాంతో తన ఆటగాళ్ల నుంచి మెరుగైన ప్రదర్శన రాబట్టాడు' అని ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు.

కెప్టెన్సీ అంటే ఇష్టం:
తనకు వివిధ కెప్టెన్లతో కలిసి ఆడాలని ఉంటుందని, వాళ్లంతా తమ జట్లను ఎలా నడిపిస్తారో చూడాలని ఉంటుందని దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. తనకు కూడా వ్యక్తిగతంగా కెప్టెన్సీ అంటే ఇష్టమని చెప్పాడు. సర్ఫరాజ్ అహ్మద్ సారథ్యంలో ఆడటం తనకు నచ్చిందని, అతడికి అవసరమైతే తాను సలహాలు, సూచనలు చేస్తానని ఫాఫ్ తెలిపాడు. ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన ఫాఫ్.. ఏడు మ్యాచ్ల్లో 320 పరుగులు చేశాడు. నాలుగు అర్ధ శతకాలు సాధించి మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే కరోనా కేసులు నమోదవ్వడంతో మిగతా మ్యాచ్లను బీసీసీఐ అర్థాంతరంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. యూఏఈలో మిగిలిన మ్యాచులను బీసీసీఐ త్వరలోనే నిర్వహించనుంది.


Click it and Unblock the Notifications












