
లాహోర్: భారత్-పాకిస్థాన్ జట్లు మళ్లీ క్రికెట్ ఆడితే చూడాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. పాకిస్థాన్కు టీమిండియా రావాలని ఆ దేశ అభిమానులు కోరుతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్లో పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ప్రారంభం అయింది. శనివారం గడాఫీ మైదానం వేదికగా ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్ జట్ల మధ్య తొలి టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో ఇస్లామాబాద్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇస్లామాబాద్ యునైటెడ్, ముల్తాన్ సుల్తాన్స్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాక్ అభిమానులు కొందరు.. పాకిస్థాన్లో టీమిండియా పర్యటించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. అందరూ కెమెరా వైపు చూస్తూ ప్లకార్డులు పట్టుకున్నారు. స్థానిక పాత్రికేయుడు సజ్ సాదిక్ ట్విటర్లో ఈ విషయాన్ని వెల్లడించాడు. 'లాహోర్ ఫ్యాన్స్ భారత్ను పాకిస్తాన్ రావాలని కోరుకుంటున్నారు' అని క్యాప్షన్ రాసుకొచ్చాడు.
ఇటీవల పాక్ మాజీ ఆటగాళ్లు షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిదిలు భారత్ క్రికెట్ ఆడదానికి తమ దేశం రావాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల రాజకీయ సమస్యలను పక్కన పెట్టి క్రీడను క్రీడగా చూడాలని వారు కోరారు. ఇరు దేశాల మధ్య క్రికెట్ సిరీస్లను అభిమానులు బలంగా కోరుకుంటున్నారని ఇద్దరూ పేర్కొన్నారు. ఇరు దేశాలకు భారత్, పాకిస్థాన్లో ఆడాలని లేకపోతే తటస్థ వేదికల్లో అయినా ఆడాలని సూచించారు.
భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరిగి చాలా కాలమైంది. దాయాది దేశాలు చివరిసారిగా 2013లో తలపడ్డాయి. అప్పటినుంచి ఇరు దేశాలు ఐసీసీ ఈవెంట్లు, ఆసియాకప్లో మాత్రమే తలపడుతున్నాయి. ఇక 2008లో చివరిసారి టెస్టు సిరీస్ ఆడాయి. తమతో టీమిండియా ఆడాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పదే పదే విజ్ఞప్తి చేసినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అయితే విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీలకు పాకిస్థాన్లోనూ అభిమానులున్నారు. వీరిపై అనేకసార్లు బహిరంగంగానే తమ అభిమానాన్ని చాటుకున్నారు.