కరాచీ: కరోనా వైరస్ (కొవిడ్-19)ను ప్రపంచ ఆరోగ్య సంస్థ మహమ్మారిగా ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ ముప్పుతో ఇంగ్లండ్ ఆటగాళ్లు స్వదేశానికి పయనమయ్యారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడుతున్న పలువురు ఇంగ్లండ్ ఆటగాళ్లు కరోనా కారణంగా స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఇదే విషయమై పీఎస్ఎల్ నిర్వాహకులు అధికారికంగా ధృవీకరించారు. ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లడానికి వీలుగా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కూడా తెలిపారు.
సిరీస్ రద్దవ్వడం దురదృష్టకరం.. కానీ ఇదే సరైన నిర్ణయం: సచిన్
ఇంగ్లండ్ ఆటగాళ్లలో జేసన్ రాయ్, మొయిన్ అలీ, టామ్ బాంటన్, అలెక్స్ హేల్స్, క్రిస్ జోర్డాన్లు పీఎస్ఎల్ లీగ్లో ఆడుతున్నారు. వీరందరూ అతి త్వరలోనే ఇంగ్లండ్ విమానం ఎక్కనున్నారు. లీగ్ జరుగుతున్న కరాచీ, సింధ్ ప్రావిన్స్లోనే కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవ్వడంతోనే ఇంగ్లీష్ ఆటగాళ్లు వెళ్లిపోతున్నారని సమాచారం. అయితే ఇంగ్లండ్ ఆటగాళ్లు వెళ్లిపోయినా లీగ్ మాత్రం యధాతథంగా కొనసాగుతుందని పీఎస్ఎల్ యాజమాన్యం స్పష్టం చేసింది.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ సీఈవో వసీమ్ ఖాన్ మాట్లాడుతూ... 'పీఎస్ఎల్ నుంచి ఇంగ్లండ్ ఆటగాళ్లు వెళ్లిపోవడమనేది వారిష్టం. కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో లీగ్లో ఆడుతున్న ఆటగాళ్ల పట్ల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇక మీదట అన్ని మ్యాచ్లు ప్రేక్షకులు లేకుండా జరగనున్నాయి. సింధ్ ప్రావిన్స్ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు అక్కడ జరగాల్సిన ఐదు మ్యాచ్లనూ కరాచీలోనే నిర్వహించనున్నాం. ఇక లీగ్లో ఆటోబయోగ్రాప్లు, సెల్సీలు, కరచాలనాలకు ఆటగాళ్లు దూరంగా ఉండాలని కూడా సూచించాం' అని తెలిపాడు.
కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ఇంగ్లాండ్ పర్యటనను శ్రీలంక రద్దు చేసుకుంది. రెండు టెస్టుల సిరీస్ను విరమించుకొని.. శ్రీలంక ఆటగాళ్లు వెంటనే స్వదేశానికి రావాలని లంక బోర్డు ఆదేశించింది. మరోవైపు కరోనా వైరస్ ముప్పుతో భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ కూడా శుక్రవారం రద్దైంది. అందుబాటులో ఉన్న మొదటి విమానాన్ని అందుకొని సొంతదేశానికి సఫారీలు వెళ్లిపోనున్నారు. ఇక మార్చి 29న ఆరంభం కావాల్సిన ఐపీఎల్ను ఏప్రిల్ 15కు బీసీసీఐ వాయిదా వేసింది. భారత్లో ఇప్పటికే 80 కరోనా కేసులు నమోదవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.