
హైదరాబాద్: అంతంతమాత్రంగానే సాగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్కు మరో షాక్ తగిలింది. పాకిస్థాన్ లీగ్లో ఆడతాను కానీ, పాకిస్థాన్లో ఆడనంటూ ఓ స్టార్ క్రికెటర్ తెగేసి చెప్పాడు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మూడో సీజన్ దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
పాకిస్థాన్ దుబాయ్కు బదులు స్వదేశంలో మ్యాచ్లు జరిగితే అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అనుకుంది. ఈ నేపథ్యంలో లీగ్ చివర్లో జరిగే కీలక మూడు మ్యాచ్లను పాకిస్థాన్లో నిర్వహించాలని తలచింది. అన్ని మ్యాచ్ లు దుబాయ్ లోనే జరుగుతాయనుకున్న విదేశీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అయితే చివరి మ్యాచ్లు పాక్లో ఆడటానికి విముఖత వ్యక్తం చేస్తున్నాడు.
లీగ్లో క్వెట్టా గ్లాడియేటర్స్ తరఫున ఆడుతున్న ఈ కుడి చేతివాటం బ్యాట్స్మెన్ పాక్లో భద్రత పట్ల ఆందోళనగా ఉన్నాడు. ఒకవేళ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గ్లాడియేటర్స్ ఫైనల్కు అర్హత సాధించినా తాను మాత్రం పాక్లో ఆడనంటూ తెగేసి చెప్పేశాడు. పీఎస్ఎల్ మ్యాచ్లు దుబాయ్లో జరుగుతాయనే ఉద్దేశంతోనే తాను గ్లాడియేటర్స్కు ఆడటానికి ఒప్పుకున్నట్లు పీటర్సన్ తెలిపాడు.
ప్రపంచ క్రికెట్లో మంచి పేరున్న పీటర్సన్ లాంటి ఆటగాళ్లు తీసుకున్న నిర్ణయం పీసీబీ ఉనికికే పెద్ద దెబ్బగా కనిపిస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే స్వదేశంలో అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించాలని తలచిన పాక్కు పీటర్సన్ ప్రకటన చేదు అనుభవమే మరి.
మరోవైపు ఈ సీజను ప్రారంభానికి ముందే 2019 లీగ్ను పూర్తిగా పాకిస్థాన్లోనే నిర్వహించనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ నజమ్ సేథీ అన్నారు. రెండేళ్లలోనే పీఎస్ఎల్కు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చినందుకు సంతృప్తిగా ఉన్నట్లు ఆయన చెప్పారు.