
హైదరాబాద్: ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో వాదనలతో గొడవలు జరగడం సహజమే. కానీ, ఒకే జట్టులో గొడవలు రావడం విచిత్రం. క్రికెట్లో అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తారసపడుతుంటాయ్. తరచూ వివాదాలలో నిలిచే పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లు మళ్లీ అదే విషయంలో వార్తల్లో నిలిచారు.
పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో మరోసారి ఇద్దరు పాకిస్తాన్ క్రికెటర్లు సహనం కోల్పోయి ప్రవర్తించారు. బుధవారం క్వెటా గ్లాడియేటర్స్-లాహోర్ క్వాలండర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. దీనిలో భాగంగా లాహోర్ క్వాలండర్స్ ఆటగాళ్లు సొహైల్ ఖాన్-యాసిర్ షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. క్వెటా ఇన్నింగ్స్ భాగంగా 19 ఓవర్ను లాహోర్ బౌలర్ సొహైల్ అందుకున్నాడు. ఆ క్రమంలోనే నాల్గో బంతికి సొహైల్ తన నియంత్రణను కోల్పోయి ప్రవర్తించాడు.
ఇలా ప్రవర్తించడానికి కారణం ఏమిటంటే.. ఆ బంతి వేసే సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న యాసిర్ షాను ఫీల్డింగ్ సెట్ చేసేందుకు యత్నించాడు. దానికి యాసిర్ షా నుంచి సరైన స్పందన రాకపోవడంతో అతనిపైకే బంతి విసిరి అక్కడ ఫీల్డింగ్లో నిలబడు అంటూ అసహనాన్ని ప్రదర్శించాడు సొహైల్.
ఈ క్రమంలోనే యాసిర్-సొహైల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ బంతిని తిరిగి అందుకున్న యాసిర్.. సొహైల్ వైపు అంతే వేగంగా విసిరాడు. గత వారం గ్లాడియేటర్స్ పేసర్ రహత్ అలీ, కరాచీ కెప్టెన్ ఇమాద్ వసీంల మధ్య వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే.