

హైదరాబాద్: టీమిండియా అల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ఆతిథ్య న్యూజిలాండ్తో సోమవారం జరిగిన మూడో వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐదు వన్డేల సిరిస్లో మరో రెండు వన్డేలు మిగిలుండగానే టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "పాండ్యా తిరిగి జట్టులో చూడటం సంతోషంగా ఉంది. తల తిప్పకుండా వికెట్ మీదే దృష్టి పెట్టి పాండ్యా బౌలింగ్ చేశాడు. పాండ్యా బౌలింగ్ చేసిన విధానం చూస్తే అతనెంత ఫోకస్ చేశాడో అర్థమవుతుంది. పది ఓవర్లు వేసిన పాండ్యా 2 వికెట్లు తీసుకుని 45 రన్స్ ఇచ్చాడు. జట్టు తరపున కీలక పాత్ర పోషించే ప్లేయర్. పాండ్యాతో తుది జట్టులో బ్యాలెన్స్ వచ్చింది" అని కోహ్లీ అన్నాడు.
మూడో వన్డేలో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగింది. తొడ కండాలు పట్టేయడంతో ధోనికి విశ్రాంతినిచ్చిన కెప్టెన్ కోహ్లీ అతని స్థానంలో వికెట్ కీపర్గా దినేశ్ కార్తీక్ని తీసుకున్నాడు. ఇక గత రెండు వన్డేలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయిన ఆల్రౌండర్ విజయ్ శంకర్ స్థానంలో హార్దిక్ పాండ్యాకి అవకాశమిచ్చాడు.
న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేలో పాండ్యా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్లో 10 ఓవర్లు వేసిన పాండ్యా కీలక సమయంలో చెలరేగి 2 వికెట్లు తీశాడు. 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం... ఆ తర్వాత నిషేధం విధించడంతో పాండ్యా అర్ధాంతరంగా ఆసీస్ పర్యట నుంచి భారత్కు తిరిగొచ్చాడు.
అయితే, రెండు రోజుల క్రితం పాండ్యాపై బీసీసీఐ పాలకుల కమిటీ నిషేధం ఎత్తివేయడంతో మళ్లీ అతను న్యూజిలాండ్ పర్యటకు వెళ్లాడు. మరోవైపు న్యూజిలాండ్ గడ్డపై వరుసగా మూడు మ్యాచ్లు గెలవడం అంటే ఇది అసాధారణ విజయమే కోహ్లీ అన్నాడు. షమీ, భువీలు అద్భుతంగా బౌలింగ్ చేశారన్నాడు. జట్టులోని ప్రతి ఒక్కరూ అద్భుత ప్రదర్శన చేశారని కోహ్లీ కొనియాడాడు.