
హైదరాబాద్: టీమిండియా స్టార్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ తండ్రి అయ్యాడు. రోహిత్ భార్య రితికా సజ్దే ఆదివారం ముంబైలోని ఓ హాస్పిటల్లో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సొహైల్ ఖాన్ భార్య, రితికాకు బంధువు అయిన సీమా ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు.
'రోహిత్ దంపతులకు ఆడబిడ్డ జన్మించింది' అంటూ సీమా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ తన చిన్నారిని, భార్యను చూసేందుకు భారత్కు తిరుగుపయనమయ్యారు. దీంతో ఆస్ట్రేలియాతో జరుగనున్న నాలుగో టెస్ట్కు రోహిత్ శర్మ దూరం కానున్నాడు.
2015 డిసెంబరు 13న రోహిత్ తన స్నేహితురాలు, మేనేజర్ రితికాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్తో జరిపిన చిట్ ఛాట్లో రోహిత్ శర్మ తాను త్వరలో తండ్రవబోతున్న విషయాన్ని తొలిసారిగా వెల్లడించారు. తాజాగా ముంబైలోని ఓ ఆసుపత్రిలో రితికా పాపకు జన్మనిచ్చారు.
ఆసీస్ పర్యటనలో ఉన్న రోహిత్ శర్మ ప్రసవ సమయంలో భార్య పక్కన ఉండేందుకు భారత్ తిరుగుపయనమయ్యాడు. ఈ మేరకు నాలుగో టెస్టుకు రోహిత్ శర్మ దూరమయ్యాడని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా నాలుగో టెస్టు జరగనుంది. నాలుగు టెస్టుల సిరీస్లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది.