హైదరాబాద్: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ప్రస్తుత భారత జట్టులో భాగమైనందుకు ఎంతో గర్వంగా ఉందని తమిళనాడు వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ దినేశ్ కార్తీక్ అన్నాడు. న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం ఇటీవల భారత్ సెలక్టర్లు దినేశ్ కార్తీక్ని జట్టులో చోటు కల్పించిన సంగతి తెలిసిందే.
శ్రీలంక సిరిస్లో విఫలమైన మిడిలార్డర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్పై వేటు వేసిన సెలక్టర్లు.. దినేశ్ కార్తీక్ని స్టాండ్ బై వికెట్ కీపర్ 15 మంది జట్టు సభ్యుల ఎంపిక చేశారు. ఆసీస్తో జరిగిన సిరిస్కు కేఎల్ రాహుల్ ఎంపికైనప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడక పోవడం విశేషం.

న్యూజిలాండ్ అక్టోబర్ 22 నుంచి జరగనున్న పరిమిత ఓవర్ల సిరిస్లో చోటు దక్కించుకోవడంపై దినేశ్ కార్తీక్ మీడియాతో మాట్లాడాడు. ధోని నిర్వహిస్తున్న వికెట్ కీపింగ్ బాధ్యతలు తనకిస్తే, నిరూపించుకుంటానని దినేశ్ కార్తీక్ ధీమా వ్యక్తం చేశాడు.
'ప్రస్తుతం భారత్ జట్టు గొప్పగా రాణిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లాంటి బౌలర్లతో పటిష్టంగా ఉంది. ఇలాంటి జట్టులో ఆడే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. ముఖ్యంగా ప్రతి మ్యాచ్ని గెలవాలనే తపనతో ఉండే కోహ్లీ నాయకత్వంలో ఆడటం మరిచిపోలేని అనుభూతి' అని దినేశ్ కార్తీక్ అన్నాడు.
'తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉంది. నేను స్టాండ్ బై వికెట్ కీపర్గా ఎంపికయ్యాను. ఒక విధంగా చెప్పాలంటే ధోనికి నేను బ్యాకప్. దీంతో నేను నెట్స్లో కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎప్పుడు అవకాశం వచ్చినా నా అత్యుత్తమ ప్రదర్శనతో న్యాయం చేస్తాను' అని దినేశ్ కార్తీక్ వివరించాడు.
ఒకవేళ వికెట్ కీపింగ్ అవకాశం దొరక్కపోయినా.. మైదానంలో ఏ ప్రదేశంలోనైనా ఫీల్డింగ్ చేసేందుకు తాను సిద్ధమని చెప్పుకొచ్చాడు. ఇక టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో మాట్లాడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పాడు. 'రవిశాస్త్రితో మాట్లాడాను. రాబోయే రోజుల్లో నా భవిష్యత్తుపై చర్చించాను' అని దినేశ్ కార్తీక్ తెలిపాడు.