క్రికెట్లో వింత రనౌట్.. కీపర్ కాలు కింద బ్యాట్.. అంపైర్ నిర్ణయంపై రచ్చ! (వీడియో)
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా శ్రీలంక ఎ, ఇండియా ఎ జట్ల మధ్య మంగళవారం ప్రారంభమైన తొలి మ్యాచ్లోనే ఓ వింత రనౌట్ చోటుచేసుకుంది. భారత ఇన్నింగ్స్ సమయంలో వైభవ్ సూర్యవంశీ, ప్రభ్సిమ్రాన్ సింగ్ తక్కువ పరుగులకే వెనుదిరిగిన తర్వాత ఇన్నింగ్స్ను నిలబెట్టే బాధ్యత ప్రియాన్ష్ ఆర్య, రుతురాజ్ గైక్వాడ్లపై పడింది. అయితే ఈ ఇద్దరు బ్యాటర్ల మధ్య చోటుచేసుకున్న ఓ చిన్న రన్నింగ్ మిక్స్-అప్ కారణంగా ప్రియాన్ష్ ఆర్య అనూహ్య రీతిలో రనౌట్ అయ్యాడు. ఈ ఔట్ క్రికెట్ అభిమానులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా థర్డ్ అంపైర్ నిర్ణయంపై తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ విచిత్రమైన ఘటన భారత ఇన్నింగ్స్ 13వ ఓవర్లో జరిగింది. రుతురాజ్ గైక్వాడ్ బంతిని లాంగ్-ఆఫ్ వైపు ఆడి రెండో పరుగు కోసం ప్రియాన్ష్ ఆర్యను పిలిచాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ ప్రియాన్ష్ ఆర్య రెండో పరుగుకు అంగీకరించినప్పటికీ.. ఆ తర్వాత కాస్త సంకోచించాడు. ఈ తరుణంలో ఇద్దరు బ్యాటర్లు పిచ్పై ఒకే ఎండ్ వైపు పరిగెత్తారు. అయితే ప్రియాన్ష్ కంటే రుతురాజ్ గైక్వాడ్ క్రీజులోకి చేరుకున్నాడు. మరోవైపు ప్రియాన్ష్ ఆర్య క్రీజులోకి చేరే క్రమంలో శ్రీలంక వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా కాలి కింద అతని బ్యాట్ ఇరుక్కుపోయింది.

వికెట్ కీపర్ కాలు అడ్డుపడటంతో ప్రియాన్ష్ ఆర్య సకాలంలో క్రీజును అందుకోలేకపోయాడు. అయితే ఈ విషయాన్ని థర్డ్ అంపైర్ పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. వికెట్ కీపర్ కాలు బ్యాట్కు అడ్డుపడిన స్పష్టమైన వీడియో ఆధారాలు ఉన్నప్పటికీ.. అంపైర్ బ్యాటర్కు అనుకూలంగా నిర్ణయం ఇవ్వలేదు. ఒకవేళ కీపర్ కాలు అడ్డుపడకుండా ఉండి ఉంటే, రుతురాజ్ గైక్వాడ్ కంటే ముందే ప్రియాన్ష్ ఆర్య క్రీజులోకి చేరి ఉండేవాడని, అప్పుడు రుతురాజ్ ఔట్ అయ్యేవాడని సోషల్ మీడియాలో నెటిజన్లు, క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అంపైర్ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఈ వివాదాస్పద రనౌట్కు ముందే టీమిండియా యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలో వరుసగా మూడు ఫోర్లు కొట్టి మంచి ఫామ్లో కనిపించిన వైభవ్ సూర్యవంశీ, లంక పేసర్ మహమ్మద్ షిరాజ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ కూడా కేవలం 2 పరుగులు (11 బంతుల్లో) చేసి నిరాశపరిచాడు. కీలకమైన ఓపెనర్లు ఇద్దరూ త్వరగానే ఔట్ కావడంతో భారత జట్టు ప్రారంభంలోనే కష్టాల్లో పడింది.
కాగా ఈ సిరీస్ ప్రారంభానికి ముందు ఇండియా ఎ కెప్టెన్ తిలక్ వర్మ మాట్లాడుతూ.. శ్రీలంక పర్యటన యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి ఒక మంచి సవాలు అని పేర్కొన్నారు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో సూర్యవంశీ ఎంత అద్భుతంగా ఆడాడో అందరూ చూశారని, ఈ సుదీర్ఘ ఫార్మాట్లోనూ అతను రాణిస్తాడనే నమ్మకం తనకు ఉందని తిలక్ వర్మ అన్నారు. శ్రీలంకలోని పిచ్లు కాస్త నెమ్మదిగా ఉంటాయని, ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేయడం వైభవ్ సూర్యవంశీకి కొత్త అనుభవమని, అయినప్పటికీ అతను మంచి ప్రదర్శన చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, తొలి మ్యాచ్లోనే ఓపెనర్లు విఫలం కావడం, ప్రియాన్ష్ ఆర్య దురదృష్టవశాత్తూ రనౌట్ అవ్వడం భారత జట్టును దెబ్బతీసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications