న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ తల్లిదండ్రులు కావడం పట్ల ప్రముఖ బాలీవుడ్ హీరోయిన ప్రియాంక చోప్రా సంతోషం వ్యక్తం చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా విరుష్క జోడికి తనదైన శైలిలో అభినందనలు తెలిపింది. విరాట్ కోహ్లీ ట్వీట్ను షేర్ చేస్తూ.. 'అనుష్కా నీ కూతుర్ని గట్టిగా కౌటిలించుకుంటానే'అని పేర్కొంది. 'కంగ్రాట్స్ అనుష్కా, విరాట్. మీరు తల్లిదండ్రులు కావడం సంతోషంగా ఉంది. మీ లిల్ ప్రిన్సెస్ను ప్రేమతో కౌగిలించుకుంటా.'అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది.
గత సోమవారం మధ్యాహ్నం అనుష్క శర్మ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కోహ్లీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 'ఈ మధ్యాహ్నం మాకు కూతురు పుట్టింది. ఈ సంతోషకరమైన వార్తను మీతో పంచుకోవడానికి చాలా థ్రిల్గా ఫీలవుతున్నాం. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు. తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఇక మా జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించరని ఆశిస్తూ ప్రేమతో మీ కోహ్లీ'అని విరాట్ ట్వీట్ చేశాడు. ఇక విరుష్క దంపతులకు అభిమానులు, క్రీడా, సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ తెలియజేశారు.
ఇక ప్రసవ సమయంలో అనుష్క శర్మ పక్కనే ఉండేందుకు, తొలి బిడ్డ క్షణాలను ఆస్వాదించేందుకు విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో కోహ్లీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వగా.. మెజార్టీ సభ్యులు విరాట్కు అండగా నిలిచారు.