ఇటీవలి కాలంలో చాలా ఘోరంగా ఫెయిలవుతున్న బ్యాటర్లలో పృథ్వీ షా ఒకడు. టీమిండియా తరఫున అరంగేట్రంలో అదరగొట్టిన అతనిపై ఎన్నో అంచనాలు పెరిగాయి. కానీ ఆ తర్వాత అతని కెరీర్ బొక్కబోర్లా పడింది. ప్రస్తుతం అతను పరమ చెత్త ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్తో దారుణంగా ఫెయిలైన అతను.. దులీప్ ట్రోఫీలో కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.
అయితే పుజారా, సూర్యకుమార్ రాణించడంతో అతని టీం దులీప్ ట్రోఫీ ఫైనల్ చేరింది. ఈ సందర్భంగా పృథ్వీ షా మాట్లాడుతూ తన ఆటతీరు మార్చుకోవాలని అనుకోవడం లేదని తేల్చిచెప్పాడు. 'నా ఆట ఎందుకు మార్చుకోవాలో నాకు తెలియడం లేదు. అయితే ఇంకొచెం తెలివిగా అయితే ఆడగలను. నేను పుజారాలా బ్యాటింగ్ చేయలేను. పుజారా నాలా బ్యాటింగ్ చేయలేడు కదా' అని షా అన్నాడు.

'నేను ఇక్కడి వరకు రావడానికి ఉపయోగపడిన ఆటనే నేను ఆడేందుకు ట్రై చేస్తున్నా. ఎగ్రెసివ్ బ్యాటింగ్ నా కెరీర్కు బాగా యూజ్ అయింది. దాన్ని మార్చుకోవాలని అనుకోవట్లేదు' అని చెప్పాడు. అలాగే తనకు ఆడే ప్రతి మ్యాచ్ కీలకమే అన్నాడు. దులీప్ ట్రోఫీ అయినా, ముంబై తరఫున ఆడినా ఏ మ్యాచ్ అయినా తనకు ముఖ్యమే అని స్పష్టం చేశాడు. వీటిలో తన బెస్ట్ ఆట చూపించేందుకే ప్రయత్నిస్తానని అన్నాడు.
కొంచెం కష్టాలు ఎదురైతే ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి, మరింత కష్టపడటానికే ప్రయత్నిస్తానని షా తెలిపాడు. తనకు వైట్ బాల్ క్రికెట్ కొంత ఛాలెంజింగ్గా ఉందని ఒప్పుకున్నాడు. 'మనం ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండం కదా. కానీ ఇలా పరుగులు చేయలేకపోతున్నప్పుడు నేను మరింత కష్టపడేందుకు ప్రయత్నిస్తా. టీ20 క్రికెట్లో ఎక్కువ స్లాషింగ్ ఉంటుంది. అయితే మైండ్ సెట్ మారదు' అని స్పష్టం చేశాడు. మరి దులీప్ ట్రోఫీ ఫైనల్లో అయినా అతను పరుగులు చేస్తాడేమో చూడాలి.