
ముంబై: భారత యువ ఓపెనర్ పృథ్వీ షా కొత్తగా ప్రాక్టీస్ మొదలెట్టనున్నాడు. అయితే కొత్త కోచ్, మాజీ ఆటగాడి పర్యవేక్షణలో కాకుండా టెన్నిస్ క్రీడాకారిణితో ప్రాక్టీస్ చేయనున్నాడు. త్వరలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో కలిసి హైదరాబాద్లో సాధన చేయాలని షా నిర్ణయించుకున్నాడు. తన ఫుట్వర్క్ మెరుగుపరుచుకోవడంతో పాటు వృతి విలువలు పెంపొందించుకునేందుకు అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు.
నిషేధిత డ్రగ్ తీసుకొన్నందుకు 19 ఏండ్ల ముంబై క్రికెటర్ ప్రస్తుతం ఎనిమిది నెలల నిషేధం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నిషేధం నవంబరు 15న ముగియనుంది. నిషేధం కారణంగా పృథ్వీ షా సౌతాఫ్రికా, బంగ్లాదేశ్తో సిరీస్లకు దూరమయ్యాడు. ఈ ఖాళీ సమయాన్ని షా పూర్తిగా ఉపయోగించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఓవరాల్ ఫిట్నెస్తో పాటు అత్యుత్తమ ఫీల్డర్గా మారేందుకు కొత్తగా కసరత్తులు చేయనున్నాడట.
'పృథ్వీ షా ఓవరాల్ ఫిట్నెస్ మెరుగుపడేందుకు, ఫీల్డర్గా మరింత సత్తా చాటేందుకు పీవీ సింధుతో కలిసి ప్రాక్టీస్ చేయనున్నాడు' అని పృథ్వీ కోచింగ్ బృందం సభ్యుడొకరు తెలిపాడు. మైదానంలో షా అంత చురుగ్గా కదల్లేకపోవడంతో చాలా సార్లు విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో దాన్ని అధిగమించేందుకు బెస్ట్ ఫీల్డర్గా నిలువాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తాను వర్కవుట్స్ ఎలా చేస్తానో తెలిపే వీడియోను ఇటీవల సింధు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్గా మారింది. దీంతో షా ప్రేరణ పొందాడు.
మరోవైపు ఫుట్వర్క్ మెరుగుపరచుకునేందుకు భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ రెగ్యులర్గా బ్యాడ్మింటన్ ఆడేవాడు. బంతిని వీలైనంత త్వరగా గుర్తించే సామర్థ్యాన్ని మెరుగుపరచుకునేందుకు మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ టేబుల్ టెన్నిస్ సాధన చేసేవారు. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ ఫుట్ బాల్ ఆడతారు. ప్రస్తుత, మాజీ క్రికెటర్ల తరహాలోనే షా కూడా ఆటలో ఉన్నత స్థాయికి చేరుకునేలా సన్నద్ధం కావాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే సింధుతో కలిసి హైదరాబాద్లో సాధన చేయనున్నాడు.