

హైదరాబాద్: రాజ్కోట్ వేదికగా వెస్టిండిస్తో జరుగుతున్న అరంగేట్ర టెస్టులో ఓపెనర్ పృథ్వీషా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్లో 99 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో పృథ్వీషా సెంచరీ సాధించాడు. తద్వారా అంతర్జాతీయ మ్యాచ్లో ఆరంగేట్రంలోనే సెంచరీ చేసిన 15వ భారత ఆటగాడిగా పృథ్వీ షా అరుదైన ఘనత సాధించాడు.
తద్వారా గంగూలీ, సెహ్వాగ్ తదితర దిగ్గజాల సరసన చేరాడు. దీంతోపాటు అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడైన భారత క్రికెటర్గా అరుదైన ఘనత సాధించాడు. పృథ్వీ షా 18 ఏళ్ల 329 రోజుల వయసులోనే ఈ ఘనత సాధించాడు. తొలి టెస్టులో వంద బంతుల్లోపు సెంచరీ చేసిన మూడో బ్యాట్స్మన్.
గతంలో శిఖర్ ధావన్ (85), డ్వేన్ స్మిత్ (93) ఈ ఘనత సాధించారు. దీంతోపాటు అతి చిన్న వయసులోనే సెంచరీ చేసిన భారత రెండో ఆటగాడిగా పృథ్వీషా నిలిచాడు. పృథ్వీషా కంటే ముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. 1990లో 17 ఏళ్లకే ఇంగ్లాండ్పై సచిన్ సెంచరీ సాధించాడు.
దీంతో పాటు రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ అరంగేట్ర మ్యాచుల్లోనూ సెంచరీలు చేసిన పృథ్వీ షా... ఇప్పుడు టెస్టు క్రికెట్లోనూ ఆ ఘనతను సొంతం చేసుకున్నాడు. రంజీ ట్రోఫీ ఆరంభ మ్యాచ్లో కూడా తమిళనాడుపై 120 బాదిన పృథ్వీషా...
దులీప్ ట్రోఫీ ఆరంగేట్ర మ్యాచ్లో కూడా 154 పరుగులు చేసి అదరగొట్టాడు.