
హైదరాబాద్: న్యూజిలాండ్లో జరుగుతున్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్లో పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీతో రాణించిన శుభమాన్ గిల్ మైదానం వెలుపల చాలా చిలిపిగా ఉంటాడని కెప్టెన్ పృథ్వీ షా వెల్లడించాడు. టోర్నీలో భాగంగా పాక్తో మంగళవారం జరిగిన రెండో సెమీ ఫైనల్లో శుభమాన్ గిల్ (102 నాటౌట్)తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం పృథ్వీ షా మీడియాతో మాట్లాడుతూ 'శుభమాన్ గిల్ మైదానంలో చాలా ఏకాగ్రతగా బ్యాటింగ్ చేస్తాడు. ఫీల్డింగ్లోనూ ఎక్కువ చురుకుగా ఉంటాడు. మైదానం వెలుపల మాత్రం చాలా సరదాగా అందరినీ ఆటపట్టిస్తుంటాడు. సెమీ ఫైనల్ మ్యాచ్లో బ్యాట్స్మెన్తో పాటు బౌలర్లూ మెరుగ్గా రాణించారు. శనివారం జరిగే ఫైనల్ కోసం జట్టు మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది' అని అన్నాడు.
పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. అనంతరం 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ భారత బౌలర్ల దెబ్బకు 29.3 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది. టోర్నీలో భాగంగా శనివారం (ఫిబ్రవరి 3)న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది.
కాగా, ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న అండర్-19 ప్రపంచకప్లో టాప్ స్కోరర్గా కొనసాగుతున్న శుభమాన్ గిల్ గత ఆరు ఇన్నింగ్స్ల్లోనూ వరుసగా 147, 66, 63, 90, 86, 102 పరుగులు చేయడం విశేషం.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.