
టీమిండియాను గెలిపిస్తా:
జూన్ 18న శ్రీలంక-భారత్ జట్ల మధ్య మొదటి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా ఛానెల్తో పృథ్వీ షా మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. 'చాలా రోజుల తర్వాత భారత జట్టులో అవకాశం దక్కింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉంది. నా మదిలో ఇప్పుడు ఒక్కటే మెదులుతోంది. అదే టీమిండియాను గెలిపించడం. నేనెప్పుడూ ఏ జట్టుతో ఆడినా విజయం అందించేందుకే తొలి ప్రాధాన్యం ఇస్తా. ఈసారి కూడా కచ్చితంగా భారత జట్టును గెలిపించాలనుకుంటున్నా' అని షా తెలిపాడు. షా భారత్ తరఫున 5 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు.

మేం మంచి స్నేహితులం:
శిఖర్ ధావన్, నేను ఢిల్లీ క్యాపిటల్స్కు ఓపెనింగ్ చెయ్యకముందు నుంచే మంచి స్నేహితులం. తర్వాత మా అనుబంధం మరింత మెరుగైంది. మ్యాచ్లు లేనప్పుడు బయట కూడా తరుచూ కలుస్తుంటాం. ఎప్పుడూ క్రికెట్ గురించి మాట్లాడుకుంటాం. అతడితో కలిసి బ్యాటింగ్ చేయడం బాగుంటుంది' అని పృథ్వీ షా పేర్కొన్నాడు. ధావన్తో పాటు షా ఓపెనింగ్ చేస్తాడని కొలంబోలోని బీసీసీఐకి చెందిన భారత వర్గాలు అంటున్నాయి. దీంతో భారత జట్టులోకి మొదటిసారి ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్లకు నిరాశే ఎదురైంది. ఈ ఇద్దరికీ తుది జట్టులో స్థానం దక్కేందుకు మరికొంత సమయం పట్టేలా ఉంది.

800కు పైగా పరుగులు:
గతేడాది న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ టెస్టులో విఫలమయ్యాక బీసీసీఐ షాను పక్కనపెట్టింది. ఈ క్రమంలోనే తన ఆటను మెరుగుపర్చుకున్న పృథ్వీ.. ఆపై దేశవాళీ క్రికెట్లో రాణించాడు. ఈ ఏడాది జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో 800కు పైగా పరుగులు సాధించి కొత్త రికార్డు నెలకొల్పాడు. అనంతరం కరోనా వైరస్ కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్లో అలరించాడు. ఈ నేపథ్యంలోనే షాను ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్తో పాటు ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేస్తారని అంతా భావించినా.. అలా జరగలేదు. అయితే శ్రీలంక పర్యటనకు మాత్రం ఎంపిక చేశారు. దీంతో బాగా ఆడి తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని చూస్తున్నాడు.

ఫామ్లో షా:
దేశవాళీ, ఐపీఎల్ టోర్నీలో సత్తాచాటిన యువ ఆటగాళ్లు లంక పర్యటనలో ఉన్నారు. జట్టులో ఇప్పుడు ఐదుగురు ఓపెనర్లు ఉన్నారు. శిఖర్ ధావన్ తర్వాత పృథ్వీ షాకే ఓపెనర్గా అంతర్జాతీయ అనుభవం ఉంది. పైగా మంచి ఫామ్లో ఉన్నాడు. మిగిలిన ముగ్గురు రుతురాజ్ గైక్వాడ్, దేవదత్ పడిక్కల్, నితీశ్ రాణా. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున పడిక్కల్, చెన్నై సూపర్కింగ్స్ తరఫున రుతురాజ్ ఓపెనర్లుగా అదరగొట్టారు. కేకేఆర్ తరఫున ఓపెనింగే చేసే నితీశ్ వన్డౌన్లో కూడా ఆడగలడు. అయితే అతడికి లంక పర్యటనలో దాదాపు అవకాశం రాకపోవచ్చు.


Click it and Unblock the Notifications












