
హైదరాబాద్: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షాకు అస్సలు కాలం కలిసి రావడం లేదు. ఇటీవల రంజీ ట్రోఫీ మ్యాచ్లో అతడి భుజానికి తీవ్ర గాయమైంది. కర్ణాటకతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో అతడు గాయపడ్డాడు. రంజీల్లో పృథ్వీ షా ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
రంజీ మ్యాచ్ తొలిరోజు ఆటలో భాగంగా ఓవర్ త్రోను అడ్డుకునే క్రమంలో షా భుజానికి తీవ్ర గాయమైంది. దీంతో పృథ్వీ షా భుజం గాయాన్ని అంచనా వేసేందుకు గాను అతడిని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)కు తరలించినప్పుడు తిరిగి రావడం అనుమానంగానే మారింది.
ఎన్సీఎకు తరలించడానికి ముందు పృథ్వీ షాకు శుక్రవారం ఎంఆర్ఐ స్కాన్ తీశారు. దీంతో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా భారత-ఏ జట్టు ఆడే రెండు ప్రాక్టీస్ మ్యాచ్లకు అతడు దూరమయ్యాడు. పూర్తిగా కోలుకోనందున షా కివీస్ పర్యటనకు వెళ్లడం లేదని బీసీసీఐ పేర్కొంది.
జనవరి 22న మొదలయ్యే న్యూజిలాండ్ పర్యటనలో భారత్-ఏ జట్టు మూడు వన్డేలు, రెండు నాలుగు రోజుల మ్యాచ్లు ఆడనుంది. దీనికోసం ప్రకటించిన జట్టులో పృథ్వీ షా ఇప్పటికే చోటు దక్కించుకున్నాడు. అయితే, పృథ్వీ రెండు ప్రాక్టీస్ మ్యాచ్లకు మాత్రమే దూరమైనట్టు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.