
హైదరాబాద్: తన అరంగేట్ర సెంచరీతో ఆకట్టుకున్న యువ ఆటగాడు పృథ్వీషాను అభినందిస్తూ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. సచిన్ టెండూల్కర్ తన ట్విట్టర్లో "తొలి ఇన్నింగ్స్లోనే ఎదురుదాడి చేస్తూ శతకం సాధించావు పృథ్వీ.. ఇలాగే భయం లేకుండా ఆడు" అని అభినందించాడు.
సచిన్ ట్వీట్ చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబైన పృథ్వీషా... సచిన్కు థ్యాంక్స్ చెప్పాడు. సచిన్ మెచ్చుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్లో క్రికెట్ అభిమానులతో పంచుకుంది.
పృథ్వీ షా సెంచరీపై టీమిండియా ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ "పృథ్వీ 50 టెస్టుల అనుభవమున్న బ్యాట్స్మన్లా ఆడాడు. పృథ్వీని సరిగ్గా తీర్చిదిద్దితే సుదీర్ఘ కాలం భారత్కు ప్రాతినిధ్యం వహిస్తాడు" అని ప్రశంసించాడు. మరోవైపు టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి మాట్లాడుతూ "అరంగేట్రంలోనే బెదురు లేకుండా అదరగొట్టావ్. కొంచెం వీరూ, కొంచెం సచిన్ను గుర్తుకు తెచ్చావ్" అని అన్నాడు.